Sunday, April 6, 2025

హైదరాబాద్‌కు ఎవరు వచ్చినా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం

  • దేశం నలుమూలల నుంచి ఎవరొచ్చినా వారిని నగరానికి ఆహ్వానిస్తున్నాం
  • తెలంగాణకు 65 శాతం ఆదాయం జంట నగరాల నుంచే వస్తోంది
  • హైదరాబాద్ అభివృద్ధికి ‘హైడ్రా’ వ్యవస్థను తీసుకొచ్చాం
  • ప్రపంచ పర్యాటకులు మూసీకి వచ్చే విధంగా అభివృద్ధి చేస్తాం
  • గోపనపల్లి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో సిఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌కు ఎవరు వచ్చినా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దేశం నలుమూలల నుంచి ఎవరొచ్చినా వారిని నగరానికి ఆహ్వానిస్తున్నామని ఆయన అన్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతమైన గోపనపల్లి ఫ్లైఓవర్‌ను సిఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ గోపన్ పల్లిలో సుమారు రూ.28.5 కోట్లతో రోడ్లు భవనాల శాఖ, పివి రావు నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో దీనిని చేపట్టారు. పై వంతెనను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి సిఎం ప్రారంభించారు.

అనంతరం జెండా ఊపి ఫ్లైఓవర్ పైకి ఉమెన్ బైకర్స్‌ను సిఎం రేవంత్ రెడ్డి అనుమతించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే గాంధీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణకు 65 శాతం ఆదాయం జంట నగరాల నుంచే వస్తోందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గోపనపల్లి ఫ్లైఓవర్ ద్వారా శేరిలింగంపల్లి అభివృద్ధి చెందుతుందన్నారు. మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వానిదన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఎక్కడెక్కడి నుంచో ఇక్కడకు వచ్చి ఈ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారని సిఎం అన్నారు.

ఐదేళ్లలో రూ.1.50 లక్షల కోట్లతో మూసీ అభివృద్ధి

హైదరాబాద్ అభివృద్ధికి హైడ్రా అనే వ్యవస్థను తీసుకువచ్చామని ఆయన తెలిపారు. చిన్న వర్షం పడినా మన కాలనీలు మురికి కాల్వలు అయిపోతున్నాయని సిఎం రేవంత్ తెలిపారు. మూసీని అభివృద్ధి చేసే బాధ్యత తమదన్నారు. ఐదేళ్లలో రూ.1.50 లక్షల కోట్లతో మూసీని అభివృద్ధి చేస్తామని సిఎం రేవంత్ వెల్లడించారు. ప్రపంచ పర్యాటకులు వచ్చే విధంగా మూసీని అభివృద్ధి చేస్తున్నామన్నారు. వైఎస్సార్ హయాంలో హైదరాబాద్, కృష్ణా, గోదావరి జలాలు తీసుకువచ్చామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గోపనపల్లిలో ఎకరం రూ.100 కోట్లు పలుకుతోందన్నారు. గోపనపల్లికి వచ్చిన ఐటీ, ఫార్మా సంస్థల వల్ల భూమి ధర పెరిగిందని ఆయన వివరించారు. మూసీ అంటే ముక్కు మూసుకునే పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన చెందారు. ప్రపంచ పర్యాటకులు మూసీకి వచ్చే విధంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. మూసీని చూస్తే ప్రజా ప్రభుత్వం గుర్తుకు వచ్చేలా అభివృద్ధి చేస్తామని సిఎం రేవంత్ వెల్లడించారు.

ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్‌ల మధ్య సెమీ అర్భన్

హైదరాబాద్‌ను విశ్వనగరంగా చేయడానికి మీ సహకారం కావాలని సిఎం రేవంత్ కోరారు. ఔటర్ రింగ్‌రోడ్డు, రీజనల్ రింగ్‌రోడ్డు మధ్య సెమీ అర్బన్‌ను తీర్చిదిద్దుతామని సిఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో అవసరం కోసం అవసరమైన ఏ నిధులను ఆపకుండా పూర్తిస్థాయిలో ఎక్కడికక్కడ వేగంగా మీకు నిధులిస్తున్నామన్నారు. మన నగరానికి తలమానికం మూసీ నది ఉందని, అలాంటి మూసీనది మురికి కూపంగా మారి, ప్రపంచంలో ఉన్న చెత్త మొత్తం మూసీ నదిలో వేసే పరిస్థితి నెలకొందన్నారు. కాల్వలు, నాలాలు కబ్జా పెట్టుకొని మూసీ వైపు వెళ్లాల్సిన నీళ్లను మనం ఎక్కడికక్కడ కబ్జాలతో అడ్డుకోవడంతో ఈరోజు మన కాలనీలు చిన్న వర్షం పడినా జలమయం అయిపోతున్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మూసీని చూస్తే లండన్‌ను తలపించాలని ఆయన అన్నారు.

అభివృద్ధి, సంక్షేమం తమకు రెండు కళ్లు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 

అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం తమకు రెండు కళ్లని ఆయన అన్నారు. ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉన్నామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా రూ. 2 లక్షల రుణమాఫీని నెరవేరుస్తామన్నారు. గత ప్రభుత్వం మాటలు చెబితే తాము చేతల్లో చూపెట్టామన్నారు. రాష్ట్రంలో రోడ్లను సమూలంగా అభివృద్ధి చేస్తామని, అవసరమైన చోట కొత్త రోడ్లను ఏర్పాటు చేస్తామని ఆర్ అండ్ బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, నాయకులు జగదీశ్వర్ గౌడ్, ఎంబిసి చైర్మన్ జెరిపేటి జైపాల్, రఘునాథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com