Monday, March 10, 2025

ప్రభుత్వ భూములను బడాబాబులకు రిజిస్ట్రేషన్ చేస్తే సహించేది లేదు

  • తప్పు చేసిన అధికారులపై చర్యలు ఉంటాయి
  • ఉద్యోగులు నిజాయితీ, అంకితభావంతో పని చేయాలి
  • ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా సేవలు అందించాలి
  • కొందరు అధికారుల పనితీరు బాగాలేదు
  • అధికారుల పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవు
  • సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల అద్దెలు, విద్యుత్ ఛార్జీలను త్వరలోనే చెల్లిస్తాం
  • రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ వార్షిక నివేదికను విడుదల చేసిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

ప్రభుత్వ స్థలాలు పేదవాడికే దక్కాలని, బడాబాబులకు రిజిస్ట్రేషన్ చేస్తే సహించేది లేదని, తప్పు చేసిన అధికారులపై చర్యలు ఉంటాయని రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని ఎంసిఆర్‌హెచ్‌ఆర్డీలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులతో సమావేశమైన ఆయన శాఖ పనితీరుపై సమీక్ష జరిపారు. దీంతోపాటు అధికారులతో ముఖాముఖీని నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఉద్యోగులు నిజాయితీ, అంకితభావంతో పని చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా సేవలు అందించాలని ఆయన సూచించారు. అలాగే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల అద్దెలు, విద్యుత్ ఛార్జీలు, అద్దె వాహనాల ఛార్జీలు తదితర మొదలైన వాటికి అవసరమైన బడ్జెట్ అవసరాలను త్వరలో క్లియర్ చేస్తామని ఆయన ఉద్యోగులకు హామీ ఇచ్చారు.

రెండేళ్లలో కొత్త భవనాలు అందుబాటులోకి….
రిజిస్ట్రేషన్ శాఖకు శాశ్వత ప్రభుత్వ భవనాల ఆవశ్యకతను మంత్రి ప్రస్తావిస్తూ, త్రిముఖ వ్యూహాన్ని రూపొందిస్తున్నామని, దీని కింద అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు రెండేళ్లలో ప్రభుత్వ భవనాల్లో పనిచేయడం ప్రారంభిస్తాయని మంత్రి చెప్పారు. ఇతర రాష్ట్రాల్లోని రిజిస్ట్రేషన్ శాఖల్లో ఉన్న మంచి విధానాలను మన రాష్ట్రంలో కూడా పాటించేలా అధ్యయనం చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. ప్రజలకు పారదర్శకంగా సేవలను అందించేందుకు వీలుగా కొత్త టెక్నాలజీలను అవలంభించాల్సిన అవసరాన్ని ఆయన తెలియచేశారు.

ప్రభుత్వ కార్యదర్శి, స్టాంపులు రిజిస్ట్రేషన్ల కమిషనర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి రిజిస్ట్రేషన్ శాఖ పనితీరు గురించి సంక్షిప్త వివరణ ఇచ్చారు. 2014లో రూ.2,746 కోట్లుగా ఉన్న రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం గతేడాది 14,588 కోట్లకు చేరుకుందని, మంత్రి మార్గదర్శకత్వంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బదిలీలు సజావుగా పూర్తయ్యాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ వార్షిక నివేదికను మంత్రి విడుదల చేశారు.

అధికారులను తలెత్తుకునేలా చేస్తా
కొందరు అధికారుల పనితీరు బాగాలేదని, అధికారుల పనితీరు మార్చుకోకపోతే ఎంతటి వారిపై అయినా చర్యలు తీసుకోక తప్పదన్నారు. అధికారులు మానవత్వంతో పనిచేయాలని, రెవెన్యూ వ్యవస్థకు మంచి పేరు తీసుకొచ్చేలా పని చేయాలని మంత్రి పొంగులేటి సూచించారు. తనకు ఎవరి మీద కోపం లేదని, ప్రభుత్వ పరిధిలోని అన్ని శాఖలను నిరంతరం పర్యవేక్షిస్తుంటానని, అధికారులను తలెత్తుకునేలా చేస్తానని మంత్రి పొంగులేటి చెప్పారు. ఇక అధికారుల పదోన్నతులు, బదిలీల విషయంలో ఎవరి ప్రమేయం అవసరం లేదని, రాజకీయ నాయకుల పైరవీలతో వచ్చినా వృథా ప్రయాసే అవుతుందని మంత్రి పొంగులేటి తెలిపారు.

అన్నీ తానే చూసుకుంటానని, ఎవరైతే శాఖకు మంచి పేరు తీసుకొస్తారో వారిని గుర్తిస్తానని అధికారులకు మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఇప్పటికే తమిళనాడులోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో అవలంభిస్తున్న విధానాలను అధికారులు అధ్యయనం చేశారని, త్వరలో కర్ణాటక, మహారాష్ట్రల్లోనూ అధికారులు అధ్యయనం చేసి నివేదిక ప్రభుత్వానికి ఇవ్వాలని మంత్రి ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు ఐజిలు, డిఐజిలు, జిల్లా రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com