- ఆర్ఆర్ఆర్, మెట్రో డెవలప్మెంట్, మూసీ అభివృద్ధిపై సిఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ
- పూర్తి స్థాయిలో అభివృద్ధిపై ఫోకస్ పెట్టాం
- రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి అనువైన స్థలం అని, ఎపి సిఎం చంద్రబాబు అమరావతిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నానని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్లో టైమ్స్ హోమ్ హంట్ ప్రాపర్టీ ఎక్స్ పో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్, మెట్రో డెవలప్మెంట్, మూసీ అభివృద్ధిపై సిఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టారన్నారు. ఎపిలో వేరే ప్రభుత్వం వచ్చిందని, మన దగ్గర ఏదో జరుగుతుందని అపోహలు వద్దని ఆయన సూచించారు. బిల్డర్స్కు అన్ని అంశాల్లో బాసటగా ఉంటామన్నారు. తాము అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయ్యిందని అందులో ఎన్నికల కోడ్ మూడు నెలలు ఉందని ఆయన తెలిపారు. కోడ్ ముగియడంతో పాలనపై ఫోకస్ చేస్తామన్నారు.
బిల్డర్స్కు న్యాయమైన అన్ని అంశాల్లో మద్ధతు ఇస్తాం
ఎన్నికల కోడ్ కారణంగా తెలంగాణలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదన్నారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతుంటే అందులో ఎన్నికల కోడ్ మూడు నెలలు ఉందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు. ఇఫ్పుడు పూర్తి స్థాయిలో అభివృద్ధిపై ఫోకస్ పెట్టామని ఆయన తెలిపారు. రిజిస్ట్రేషన్ విషయంలో కూడా కంపెనీలు ఇచ్చే సూచనలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. రెండు రోజుల్లో ఈ అంశాలపై చర్చిస్తామని ఆయన తెలిపారు. పేదవాడికి మంచి చేసే పనులకు సహకరిస్తామన్నారు.