Wednesday, September 18, 2024

రైతుల ఖాతాల్లో ఈనెల 18వ తేదీ సాయంత్రం లోపు రూ.లక్ష జమ

రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు
నిధులను ఇతర ఖాతాల్లో జమ చేసుకుంటే బ్యాంకర్లపై కఠిన చర్యలు
భూమి పాస్ బుక్ ఆధారంగానే కుటుంబానికి రూ.2లక్షల పంట రుణమాఫీ
కేవలం కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన
రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులతో సంబురాలు చేసుకోవాలి
ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులు పాల్గొనాలి
పారదర్శకంగా ప్రజాహిత పాలనను అందించటమే ప్రభుత్వం ప్రాధాన్యం
ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో
ఐఏఎస్‌లు నిర్ణయాలు తీసుకోవాలి
ప్రజల నుంచి అద్భుత స్పందన వచ్చేలా కలెక్టర్‌ల పనితీరు ఉండాలి
తెలుగు భాషతో పాటు తెలంగాణ సంస్కృతీలోనూ
ఐఏఎస్‌లు భాగస్వామ్యం కావాలి
జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
మహిళలకు వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం అందిస్తుంది
ఆర్థికంగా వారికి ప్రభుత్వం చేయూతనిస్తుంది
డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క

రైతుల ఖాతాల్లో ఈనెల 18వ తేదీ సాయంత్రం లోపు రూ.లక్ష వరకు డబ్బులు జమ కానున్నట్లు సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలోనే రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులతో సంబురాలు ఉంటాయని, ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని సిఎం కోరారు. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సిఎం కలెక్టర్‌ల సమావేశంలో వెల్లడించారు. రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఇతర ఖాతాల్లో జమ చేసుకుంటే బ్యాంకర్ల పైన కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.

రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. భూమి పాస్ బుక్ ఆధారంగానే కుటుంబానికి రూ.2లక్షల పంట రుణమాఫీ చేస్తామని, కేవలం కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన విధించామని కలెక్టర్ల సదస్సులో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పారదర్శకంగా ప్రజాహిత పాలనను అందించటమే తమ ప్రభుత్వం ఎంచుకున్న మొదటి ప్రాధాన్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

సంక్షేమం, అభివృద్ధిని సమతుల్యం చేసుకుంటూ….
తెలంగాణ ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని సిఎం చెప్పారు. ప్రభుత్వ ప్రాధాన్యతలతో పాటు ప్రజల ప్రయోజనాలను అర్థం చేసుకొని పని చేయాలని జిల్లా కలెక్టర్లకు సిఎం దిశానిర్ధేశం చేశారు. సచివాలయంలో మంగళవారం జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డిలు పాల్గొన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సదస్సును ప్రారంభించగా, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ప్రారంభోపన్యాసం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు అన్ని శాఖల కార్యదర్శులు, అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరే…
అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత జిల్లా కలెక్టర్లతో ఇది రెండో సమావేశమని, ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరేనని సిఎం గుర్తు చేశారు. జిల్లా స్థాయిలో ప్రభుత్వానికి వారధులు, సారధులు మీరేనని ఆయన అన్నారు. ఇటీవలే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సమర్థులైన యువ కలెక్టర్లను నియమించామని, రాజకీయ ఒత్తిళ్లు, ఎలాంటి రాగద్వేషాలు లేకుండా కలెక్టర్ల బదిలీలు చేపట్టామన్నారు. ఐఏఎస్ అధికారుల కెరీర్‌లో జిల్లా కలెక్టర్లుగా పని చేయటమే అత్యంత కీలకమైన అవకాశమని సిఎం అన్నారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలుండే బాధ్యతలతో పాటు క్షేత్ర స్థాయిలో అన్ని అంశాలపై అవగాహన వస్తుందని, జిల్లాల్లో పనిచేసిన అనుభవమే భవిష్యత్‌లో ఉపయోగపడుతుందని సిఎం అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను చివరి లబ్ధిదారుల వరకు చేరవేసే కీలక బాధ్యత కలెక్టర్‌లదేనని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. కలెక్టర్లు ఏ జిల్లాలో పని చేసినా అక్కడి జిల్లా ప్రజల మదిలో చెరగని ముద్ర వేయాలని, తాము పని చేసే ప్రాంత ప్రజలందరి అభిమానాన్ని అందుకునేలా పని చేయాలని సిఎం అన్నారు.

ఒక శంకరన్, ఒక శ్రీధరన్‌లా సామాన్యులు గుర్తు పెట్టుకునేలా….
ఇటీవల రాష్ట్రంలో ప్రభుత్వం టీచర్లకు ప్రమోషన్లతో పాటు బదిలీలు చేసిందని, కొన్నిచోట్ల టీచర్లు బదిలీపై వెళుతుంటే విద్యార్థులు సొంత కుటుంబసభ్యుడిలా స్పందించారని సిఎం రేవంత్ పేర్కొన్నారు. వాళ్లకు అడ్డుపడి కన్నీళ్లు పెట్టుకున్న సంఘటనలు మీడియాలో చూసినట్లు సిఎం చెప్పారు. జిల్లాల్లో కలెక్టర్లు బదిలీ అయినా ప్రజల నుంచి అలాంటి స్పందన వచ్చేలా పనితీరు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. అక్కడి ప్రజలు కలెక్టర్‌ను బదిలీ చేయకుండా అడ్డుకునేంత అనుబంధాన్ని సంపాదించుకోవాలని ఉదాహరణగా ఆయన చెప్పారు. వివిధ రాష్ట్రాల నుంచి వివిధ సంస్కృతుల నుంచి వచ్చిన ఐఏఎస్ అధికారులు తెలంగాణలో పనిచేస్తున్నారని, విధి నిర్వహణలో భాగంగా ఇక్కడి భాష నేర్చుకుంటే సరిపోదని, భాషతో పాటు తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యం కావాలని సిఎం కలెక్టర్లకు సూచించారు. తెలంగాణను తమ సొంత రాష్ట్రంగా భావించి పని చేయాలని, ఇక్కడి ప్రజలతో మమేకం కావాలని, ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఒక శంకరన్, ఒక శ్రీధరన్‌లా సామాన్యులు గుర్తు పెట్టుకునేలా ఐఏఎస్‌లు పని చేయాలని సిఎం రేవంత్ అన్నారు.

ఎసి గదులకే పరిమితం కావొద్దు
క్షేత్ర స్థాయిలో ప్రజల ఆలోచన ఏమిటో తెలుసుకోవాలని కేవలం ఎసి గదులకే పరిమితమైతే ఎలాంటి సంతృప్తి ఉండదని సిఎం రేవంత్ పేర్కొన్నారు. తాము చేపట్టే ప్రతి పని ఇది ప్రజా ప్రభుత్వమని ప్రజలకు తెలిసేలా ఉండాలన్నారు. జిల్లా కలెక్టర్లు అందరూ క్షేత్రస్ధాయిలో పర్యటించాల్సిందేనని ముఖ్యమంత్రి ఆదేశించారు. పాఠశాలలు, హాస్టళ్లు, ఆసుపత్రుల ద్వారా ప్రజలకు సేవలందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి పేద విద్యార్థిపై ప్రభుత్వం ప్రతి నెలా రూ.85వేలు ఖర్చు పెడుతుందని సిఎం రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంతో పాటు పిల్లల భవిష్యత్‌ను నిర్ధేశించే విద్యా వ్యవస్థను సమర్ధంగా తీర్చిదిద్దే చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు. అందుకే ప్రభుత్వ స్కూళ్లు, ఆసుపత్రులను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలని సిఎం రేవంత్ ఆదేశించారు. తనిఖీలకు వెళ్లినప్పుడు ప్రజలతో మాట్లాడాలని, అక్కడికక్కడ పరిష్కారమయ్యే చిన్న చిన్న పనులను వెంటనే పరిష్కరించాలని సిఎం కలెక్టర్లకు సూచించారు. గతంలో పది పెద్ద జిల్లాలుండేవని, అప్పడు పది మంది కలెక్టర్లే ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా నడిపించారని, అప్పటితే పోలిస్తే ఇప్పుడు జిల్లాల పరిధి, జనాభా తగ్గిపోయిందని, అప్పటితో పోలిస్తే కలెక్టర్ల అధికారాలు, బాధ్యతల్లో తేడా ఏమీ లేదని, అప్పుడు పదిమంది చేసిన పనిని ఇప్పుడు 33 మంది కలెక్టర్లు కలిసికట్టుగా ఎందుకు చేయలేరని ఆయన అన్నారు.

ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
ఎవరికీ వారుగా మీ ఆలోచనలు, మీ పనితీరును సమర్ధతను చాటుకోవాలని, ఇది ప్రజా ప్రభుత్వమని, ఇక్కడ అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలతో ప్రజలకు విశ్వాసం కల్పించే బాధ్యత మీదేనని సిఎం కలెక్టర్లకు మార్గదర్శనం చేశారు. కలెక్టరేట్లలో ప్రతి వారం నిర్వహించే ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సిఎం కలెక్టర్లను ఆదేశించారు. జిల్లా స్థాయిలో సమస్యలు పరిష్కారమైతే, హైదరాబాద్‌లో ప్రజాభవన్‌కు వచ్చే అర్జీల సంఖ్య తగ్గిపోతుందని, అదే మీ పనితీరుకు అద్దం పడుతుందని సిఎం అన్నారు. ఆరు గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లపై ఉందన్నారు. ఇప్పటికే ప్రకటించిన ఆరు గ్యారంటీలను రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయాలన్నది ప్రభుత్వ ధ్యేయమని సిఎం పునరుద్ఘాటించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొని గృహజ్యోతి, మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ పథకాలకు అర్హులెవరికైనా ఈ పథకం వర్తించకపోతే తమ ఆధార్, రేషన్ కార్డు, లేదా గ్యాస్ కనెక్షన్ నెంబర్, విద్యుత్ సర్వీసు నెంబర్లు సరిచేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో ప్రజా పాలన సేవా కేంద్రాలు పని చేసేలా చూడాలని, అవసరమైతే ప్రజావాణి జరిగే రోజున కలెక్టరేట్లలోనూ సేవాకేంద్రం ఏర్పాటు చేయాలని సిఎం ఆదేశించారు.

పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
పెండింగ్‌లో ఉన్న ధరణి సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరించాలని కలెక్టర్లను సిఎం ఆదేశించారు. ‘ధరణి సమస్యల పరిష్కారానికి మార్చి 1 నుంచి మార్చి 15 వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహించిందని ఇప్పటికే ధరణి సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసిందని, అప్పటి నుంచి ఇప్పటివరకు 1,61,760 దరఖాస్తులను ప్రభుత్వం పరిష్కరించిందని, కొత్తగా 1,15,308 దరఖాస్తు చేసుకున్నారని అధికారులు వివరించారు. ఇప్పటివరకు గృహజ్యోతికి 5.89 లక్షల మంది, అయిదు వందలకు గ్యాస్ సిలిండర్ పథకానికి 3.32 లక్షల మంది సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వివరించారు. ధరణిలో దరఖాస్తులను తిరస్కరిస్తే అధికారులు తిరస్కరణకు కారణాన్ని కూడా తప్పకుండా నమోదు చేసేలా చర్యలు చేపట్టాలని సిఎం ఆదేశించారు. ఆగస్టు 15వ తేదీలోగా పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులను పరిష్కరించాలని గడువు నిర్ణయించారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని సిఎం ప్రకటించారు.

భూములు, చెరువులు, కుంటలు అన్యాక్రాంతం కాకుండా…
ప్రస్తుతం రాష్ట్రంలో 64 లక్షల మంది సభ్యులున్నారని, కోటి మందిని సభ్యులుగా చేరేలా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సిఎం రేవంత్ సూచించారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీరిదిద్దాలన్నది ప్రభుత్వ సంకల్పమని సిఎం ప్రకటించారు. అయిదేళ్లలో రూ. లక్ష కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు అందించే లక్ష్యంతో పని చేయాలన్నారు. మహిళా సంఘాల కార్యకలాపాలకు, చేపట్టే వ్యాపారాలకు తమ వినూత్న ఆలోచనలు కూడా జోడించాలని కలెక్టర్లకు సూచించారు. ఆర్టీసిలో కొత్తగా అవసరమయ్యే అద్దె బస్సులు కూడా మహిళా సంఘాలకు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని సిఎం అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని సిఎం కలెక్టర్లను అప్రమత్తం చేశారు. అవసరమైతే జియో ట్యాగింగ్ లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేసి ప్రభుత్వ భూములపై నిఘా ఉంచాలని సిఎం సూచించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రేషన్ కార్డుకు, ఆరోగ్యశ్రీ కార్డుకు లింకు పెట్టొద్దని సిఎం ఆదేశించారు. తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

గ్రామాల్లో వైద్య సేవలందించే ఆర్‌ఎంపి, పిఎంపిలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలన్న డిమాండ్ ఉందని, అధ్యయనం చేసి అందుకు సంబందించిన ఉత్తర్వులు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సిఎం అధికారులకు సూచించారు. రూరల్ ఏరియాలో పనిచేసే డాక్టర్లకు పారితోషికం అందించి ప్రోత్సహించాలని సిఎం సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రతి బెడ్‌కు ఒక సీరియల్ నెంబర్ ఉండాలని, గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయం అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు. ఆసుపత్రుల నిర్వహణపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని సిఎం చెప్పారు. స్థానికంగా స్వచ్ఛంద సంస్థల సహకారం, పరిశ్రమల నుంచి సిఎస్‌ఆర్ నిధులు తీసుకోవాలని, వ్యాపార వాణిజ్యవేత్తల భాగస్వామ్యం తీసుకొని వాటి నిర్వహణ మెరుగుపరిచే విధానాన్ని అవలంబించాలని సిఎం రేవంత్ సూచించారు. అనుభవజ్ఞులైన స్పెషాలిటీ డాక్టర్లను ఆసుపత్రుల నిర్వహణ బాధ్యతల నుంచి తప్పించి వైద్య సేవలకు వినియోగించుకోవాలని, మిగతా డాక్టర్లకు నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని సిఎం సూచించారు.

కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్షం: భట్టి
కలెక్టర్ల సదస్సులో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 64 లక్షల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారన్నారు. వీరి సంఖ్యను కోటికి పెంచి వారిని కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. స్వయం సహాయక సంఘాలకు ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో రూ.340 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో రూ.140 కోట్లు మొత్తంగా రూ.480 కోట్లను బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించామన్నారు. ఈ రుణాలకు వడ్డీ రూ.1,566 కోట్లను ప్రభుత్వం చెల్లించిందన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం అందిస్తుందని, ఆర్థికంగా వారికి చేయూతనిస్తుందని ఆయన తెలిపారు. కొత్త విద్యుత్ పాలసీలో భాగంగా మహిళలను సోలార్ విద్యుత్ పైపు మళ్లీంచి ఆర్థికంగా ప్రోత్సహించాలని నిర్ణయించినట్టు డిప్యూటీ సిఎం తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలు ఇప్పించి బ్యాటరీ బస్సులు కొనుగోలు చేయించి ఆర్థికంగా ప్రోత్సహించాలని నిర్ణయించినట్టు భట్టి తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular