ముంబై : ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రికీ పాంటింగ్ మళ్లీ హెడ్కోచ్గా కనిపించనున్నాడు. ఆస్ట్రేలియాకు మూడు వరల్డ్ కప్లు అందించిన ఈ దిగ్గజ కెప్టెన్ పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీకి కోచ్గా నియమితులయ్యాడు. 17వ సీజన్ చాంపియన్ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ను వీడిన పాంటింగ్ ఇప్పుడు పంజాబ్ ఐపీఎల్ ట్రోఫీ కలను నిజం చేసే పనిలో నిమగ్నం కానున్నాడు.
కొత్త ఫ్రాంచైజీకి కోచ్గా వెళ్తున్న పాంటింగ్ ఎంతో సంతోషంగా ఉందంటున్నాడు. ‘నన్ను కొత్త హెడ్కోచ్గా తీసుకున్న పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీకి కృతజ్ఞతలు. ఈ కొత్త సవాల్ను స్వీకరించేందుకు నేను ఎంతో ఉత్సాహంతో ఉన్నా. పంజాబ్ జట్టు ప్రణాళికల గురించి యాజయాన్యంతో జరిపిన చర్చలు చాలా సంతృప్తినిచ్చాయి.
ఫ్రాంచైజీపై నమ్మకం పెట్టుకున్న అభిమానుల నమ్మకాన్ని నిజం చేయాల్సిన సమయం వచ్చేసింది. ఇకపై పంజాబ్ కింగ్స్ ఆటలో మార్పు చూస్తారని మేము మీకు ప్రామిస్ చేస్తున్నాం’ అని పాంటింగ్ తెలిపాడు. ఐపీఎల్ ట్రోఫీ కోసం ఏండ్లుగా నిరీక్షిస్తున్న పంజాబ్ కింగ్స్కు పాంటింగ్ అనుభవం బలం కానుంది.
ఏడు సీజన్లలో ఓసారి ఢిల్లీని ఫైనల్ చేర్చిన ఈ ఆసీస్ మాజీ సారథి ప్రీతి జింతా టీమ్ రాత మార్చేందుకు రెడీ అవుతున్నాడు. తొలుత అతడు కోల్కతా నైట్ రైడర్స్ కొత్త మెంటార్గా వెళ్తాడనే వార్తలు వినిపించాయి. కానీ, పంజాబ్ యాజమాన్యం జూలై 25వ తేదీనే పాంటింగ్ను సంప్రందించింది. ఢిల్లీ క్యాపిటల్స్ తనపై వేటు వేశాక ‘నేను మళ్లీ ఐపీఎల్లో కోచింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానసని ఈ ఆసీస్ లెజెండ్ ప్రకటించాడు. అనుకున్నట్టుగానే పాంటింగ్ మళ్లీ ఐపీఎల్లో కోచ్గా తన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నాడు.