- తోలకట్ట ఫాం హౌస్లో పట్టుబడ్డ కోళ్లకు కోర్టులో వేలంపాట
- వచ్చిన డబ్బులు ప్రభుత్వ అకౌంట్లో డిపాజిట్
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం తోలకట్టలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఫాం హౌస్ కేసులో పట్టుబడ్డ పందెం కోళ్ళు వేలం పాటలో రికార్డు ధరకు అమ్ముడుపోయాయి. వివరాల్లోకి వెళితే.. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తొల్కట్ట ఫామ్ హౌస్లో ఈ నెల 11న పట్టుబడ్డ 81 పందెం కోళ్లు రూ.16.60 లక్షలకు అమ్ముడుపోయాయి. పోలీసులు రైడ్ చేసిన సమయంలో 61 మందిని అదుపులోకి తీసుకోవడంతో పాటు రూ.30 లక్షల నగదు, 46 కోడి కత్తులు, 55 కార్లు, 64 మొబైల్ ఫోన్లతో పాటు 84 పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు.
గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులతో పాటు కోళ్లను కూడా కోర్టుకు అప్పజెప్పారు. అయితే పట్టుబడ్డ 84 కోళ్లలో 3 కోళ్లు చనిపోగా.. వాటికి పోస్టుమార్టం చేసి రిపోర్టు కోర్టుకు సబ్మిట్ చేశారు. మిగితా 81 కోళ్లను సోమవారం కోర్టు ఆవరణలో 10 కోళ్ల చొప్పున విభజించి వేలంపాట నిర్వహించారు. దాదాపు 100 మంది పాల్గొన్న ఈ వేలంపాటలో తొలి 10 కోళ్లకు రూ.3.75 లక్షలు, తర్వాతి 10 కోళ్లకు రూ.2.50 లక్షలు, తర్వాతి 10 కోళ్లకు రూ. 1.15 లక్షలు… ఇలా మొత్తం కోళ్లకు రూ. 16.60 లక్షలు వచ్చాయి. ఈ డబ్బులతో పాటు దాడిలో పట్టుబడ్డి నగదును కూడా ప్రభుత్వ అకౌంట్లో జమచేసినట్లు మొయినాబాద్ పోలీసులు తెలిపారు.