బస్పాస్ ఉన్నవారికి గుడ్న్యూస్
హైదరాబాద్ నగరంలో తిరిగే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సాధారణ పాస్ హోల్డర్లకు టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ అందించింది. ఇకపై బస్పాస్ ఉన్న వారు అదనంగా రూ.20 చెల్లిస్తే మెట్రో డీలక్స్ బస్సుల్లోనూ ప్రయాణించేందుకు అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్ ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతోనే మరో నూతన పథకానికి శ్రీకారం చుట్టినట్లు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది. ఆర్టీసీ అధికారులు మెట్రో కాంబో టికెట్ పేరుతో ప్రయాణికులకు పరిచయం చేశారు. జనరల్ బస్పాస్తో పాటు మెట్రో బస్పాస్ కలిగిన ప్రయాణికులు కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకునే వెసులుబాటును కల్పించారు. కేవలం రూ. 20 అదనపు రుసుము చెల్లించి ఈ కాంబో టికెట్ను పొందితే, ఆ రోజు నగరంలోని అన్ని మెట్రో డీలక్స్ బస్సు సర్వీసులలో సురక్షితంగా ప్రయాణించవచ్చు. ఈ నూతన విధానం వివరాలను టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు.
అన్ని మెట్రో డీలక్స్ బస్సుల్లో
హైదరాబాద్లోని అన్ని మెట్రో డీలక్స్ బస్సు సర్వీసులకు ఈ మెట్రో కాంబో టికెట్ వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన అనుభూతులను అందించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ వర్గాలు స్పష్టం చేశాయి.