సభలో ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి కిరణ్ రిజిజు
సుదీర్ఘ చర్చ అనంతరం వోటింగ్
బిల్లు రాజ్యాంగంపై దాడి అన్న కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ
సుదీర్ఘ చర్చ తర్వాత లోక్సభలో ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ బిల్లును కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు గురువారం ఎగువసభలో ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై చర్చ ప్రారంభించారు. ఈ బిల్లుపై బుధవారం లోక్సభలో 14 గంటలకు పైగా చర్చ జరిగింది. విపక్షాల ఆరోపణలు, అధికార పక్షం కౌంటర్లతో సభ వాడీవేడిగా సాగింది. అనంతరం వోటింగ్ పక్రియ నిర్వహించగా. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు వోటు వేశారు. 56 వోట్ల తేడాతో ప్రతిపక్షాల అభ్యంతరాలు వీగిపోయాయి. రాజ్యసభలోనూ దీనిపై చర్చ కోసం 8 గంటలు కేటాయించారు. అవసరమైతే సమయాన్ని పెంచనున్నారు. అనంతరం వోటింగ్ చేపడతారు. ఎగువ సభలోనూ అధికార ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం ఉండటంతో బిల్లు గట్టెక్కడం లాంఛనమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఉభయ సభల్లో ఆమోదం పొందిన అనంతరం రాష్ట్రపతి సంతకంతో ఇది చట్టంగా మారనుంది.
తీవ్రంగా స్పందించిన సోనియాగాంధీ
లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందడంపై కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ తీవ్రంగా స్పందించారు. రాజ్యాంగంపై నిస్సిగ్గుగా దాడి జరిగిందని అభిప్రాయపడ్డారు. గురువారం రాజ్యసభలోకి వెళ్లే ముందు సోనియాగాంధీ మీడియాతో మాట్లాడారు. సమాజంలో శాశ్వత విభజనను తీసుకొచ్చేందుకు బీజేపీ యత్నిస్తోందని.. అందులో భాగంగానే వక్ఫ్ బిల్లును ఆమోదించినట్లుగా వ్యాఖ్యానించారు. దిగువ సభలో బిల్లును బుల్డోజర్ చేశారని చెప్పారు. అలాగే వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును కూడా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేందుకే సభలోకి తీసుకొస్తున్నారని సోనియాగాంధీ ధ్వజమెత్తారు. మోదీ నిర్ణయాల కారణంగా దేశం అగాధంలోకి నెట్టబడుతోందని.. ఈ నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజ్యాంగం కాగితంపైనే ఉంటుంది.. అందుకే దాన్ని బుల్డోజర్ చేయడమే బీజేపీ లక్ష్యమని పేర్కొన్నారు. న్యాయం కోసం ఎంపీలంతా కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇక పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదని.. తరచుగా గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు.
వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్సభలో ఆమోదం లభించింది. బుధవారం బిల్లుపై పార్లమెంట్లో వాడీవేడీగా చర్చ జరిగింది. దాదాపు 12 గంటల పాటు- అధికార-ప్రతిపక్ష సభ్యులు ప్రసంగించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత బిల్లు ఆమోదం కోసం లోక్సభ స్పీకర్ ఓంబిర్లా వోటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా వోటింగ్ పడడంతో ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 282 మంది వోటు- వేయగా.. 232 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. ఇక గురువారం ఈ బిల్లు రాజ్యసభకు రానుంది. ఇక్కడ కూడా దాదాపు 8 గంటల పాటు చర్చ జరగనుంది. వక్ఫ్ పాలకవర్గాల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచుతూ పాలనలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి చేసేలా ఈ కొత్త బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. ఈమేరకు 1995 నాటి వక్ఫ్ చట్టంలో దాదాపు 40 సవరణలు చోటుచేసుకోనున్నాయి. ముస్లిం సమాజం నుంచి వస్తున్న డిమాండ్ల మేరకే ఈ మార్పులు చేస్తున్నట్లుప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఈ బిల్లును గతేడాది ఆగస్టులోనే కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది. అప్పుడు దీనిపై విపక్షాల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో దీనిని సంయుక్త పార్లమెంటరీ కమిటీ- (జేపీసీ) పరిశీలనకు పంపింది. ఈ కమిటీ పలు ప్రతిపాదనలతో బిల్లుకు ఆమోదం తెలిపింది.