రెండు వారాలుగా సాగుతున్న శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ రెస్య్యూ ఆపరేషన్లోకి కేరళ కుక్కలు ప్రవేశించాయి. మానవ అవశేషాలను గుర్తించడంలో నైపుణ్యం ఉన్న కెడావర్ డాగ్స్ను పంపిస్తున్నారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్లో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించేందుకు రెండు వారాలుగా అనేక ఏజన్సీలు నిరంతరం శ్రమిస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్జీఆర్ఐ, సింగరేణి, ర్యాట్ హోల్ మైన్స్, హైడ్రా వంటి సంస్థలు నిరంతరం శ్రమిస్తున్నాయి. మనుషులు చిక్కుకున్న ప్రదేశం మొత్తం బురద, శిథిలాలతో నిండిపోవడంతో అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నారు. అందులో భాగంగానే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్- ఎన్డీఎంఏ కేరళను కెడవర్ డాగ్స్ ను పంపాలని కోరడంతో.. అవి సొరంగంలోకి చేరుకున్నాయి.
కేరళ నుంచి కడావర్ డాగ్స్ వాటి ట్రైనర్లు శ్రీశైలంకు బయలు దేరారని ఎన్డీఎంఏ అభ్యర్థన మేరకు పంపించామని కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. కెడవర్ డాగ్స్ అనేవి శిక్షణ పొందిన శునకాలు. ఇవి మానవ అవశేషాలను గుర్తిస్తాయి. 14 రోజుల క్రితం శిథిలాల కిందట చిక్కుకున్న శ్రామికులు బ్రతికుండటం దాదాపు అసాధ్యం అనే భావిస్తున్నారు. ఈ కడావర్ డాగ్స్ మనిషి వానసను గుర్తించి వారి అవశేషాలను పసిగట్టగలుగుతాయి. మామూలు పోలీస్ డాగ్స్.. మనుషుల వాసనను పసిగడతాయి, కానీ కాడావర్ డాగ్స్ ప్రత్యకంగా డీకంపోజ్ అవుతున్న బాడీలను గుర్తించడానికి ఉపయోగిస్తారు. ఇవి దాదాపు 95శాతం వరకూ మృతదేహాలను గుర్తించగలుగుతాయి. గాలిలో నుంచి వచ్చే డీకంపోజింగ్ స్మెల్ ను గుర్తించి ఆ దిశగా వెళ్లగలుగుతాయి. కుక్కలు మనుషుల కన్నా దాదాపు 40రెట్లు ఎక్కువుగా వాసనలను పసిగెట్టగలుగుతాయి. డ్రగ్స్, బాంబ్స్, వివిధ రకాల వస్తువుల నుంచి వచ్చే వాసనలను మామూలు కుక్కలు పసిగట్టగలుగుతాయి. ప్రత్యేకంగా మృతదేహాలను గుర్తించడంలో నైపుణ్యం ఉన్న ఈ కుక్కలు మాత్రం డెడ్ బాడీలను పసిగట్టగలుగుతాయి.
ఎస్ఎల్బీసీ టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు చివరిదశకు వచ్చాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న శిథిలాల నుంచి మట్టి, బురదను బయటకు పంపిచడం కోసం ప్రత్యేకంగా కన్వేయర్ బెల్టును సిద్ధం చేశారు. ప్రస్తుతం లోపల నుంచి మట్టిని బయటకు పంపుతున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి నల్గొండ జిల్లాకు నీటిని తరలించడానికి తవ్వుతున్న ఈ టన్నెల్లో 14 కిలోమీటర్ల లోపల ప్రమాదం జరిగింది. ప్రస్తుతం 13.8 కిలోమీటర్ల వరకూ వెళ్లడానికి కుదురుతోంది. ఓ వంద మీటర్ల పరిధిలోనే టన్నెల్లో చిక్కుకున్న 8 మంది ఉంటారని భావిస్తున్నారు. ఆ శిధిలాలను తొలగించే పని ప్రస్తుతం సాగుతోంది.