* మల్కాజ్ గిరి లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్ధిగా శంభీపూర్ రాజ్
* ఖరారు చేసిన పార్టీ అధినేత కేసీఆర్
*ఒకటి, రెండు రోజుల్లో అధికారిక ప్రకటన
టీఎస్ న్యూస్ :ఎట్టకేలకు మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ ఖరారు చేసింది. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు పార్టీ అధిష్టానం అవకాశం కల్పించింది. ముందుగా ఈ నియోజకవర్గం మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యుడు మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డిని బరిలోకి దింపాలని భావించింది. అయితే ఆయన పోటీ చేయడానికి సుముఖంగా లేకపోవడంతో
శంభీపూర్ రాజుకు అవకాశం ఇస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీనిపై అధికారికంగా ఒకటి, రెండు రోజుల్లో ప్రకటన చేసే అవకాశముందని తెలుస్తోంది. కాగా గతంలో ఆయన కుత్బుల్లాపూర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని పలుమార్లు చివరి నిమిషం వరకు యత్నించారు. కానీ పోటీ చేసే అవకాశం లభించ లేదు. దీని కారణంగా పార్టీ అధిష్టానం ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది.
ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్ సభ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ విజయం సాధించారు. అన్ని సెగ్మెంట్లలో కలిపి మూడున్నర లక్షల ఓట్ల మెజార్టీ వచ్చింది. దీంతో లోక్ సభ ఎన్నికల్లోనూ ఈ సెగ్మెంట్ సునాయాసంగా గెలుచుకోనే అవకాశముందని పార్టీ అధిష్టానం భావించినప్పటికీ… అభ్యర్థులు వెనుకడుగు వేయడంతో శంభీపూర్ రాజుకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లు అయింది. ఇదిలా ఉండగా మంగళవారం రాత్రి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను శంభీపూర్ రాజు కలిసి ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై చర్చించారని తెలుస్తోంది.