ఒక్క ఏడాదే 2.13 కోట్ల మంది ప్రయాణం
శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల రాకపోకల్లో సరికొత్త రికార్డును నెలకొల్పుతోంది. గత ఆర్థిక సంవత్సరం 15.20 శాతం వృద్ధిని సాధించి, దేశంలోని అగ్రశ్రేణి విమానాశ్రయాల కంటే ఎగువన నిలిచి సరికొత్త రికార్డును సృష్టించింది. గత ఆర్థిక సంవత్సరం 2024-25లో శంషాబాద్ విమానాశ్రయం నుంచి మొత్తం 2.13 కోట్ల మంది ప్రయాణించారు. ఇదే రద్దీ కొనసాగితే వచ్చే ఏడాది ఈ సంఖ్య మూడు కోట్లు దాటినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో చివరి 3 నెలలు జనవరి నుంచి మార్చి వరకు దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకల్లోనూ శంషాబాద్ విమానాశ్రయం అరుదైన ఘనతను సాధించింది. ఇక్కడి నుంచి నెలకు ప్రయాణించే వారి సంఖ్య గరిష్ఠంగా 20 లక్షలే కాగా, ఈ మూడు నెలల్లో ఏకంగా 74 లక్షల మంది రాకపోకలు సాగించడం విశేషం. ఈ విషయంలో హైదరాబాద్, జనాభాలో ముందున్న మెట్రో నగరాలు చెన్నై, కోల్కతాలను దాటేసింది.
అలాగే తన రోజువారీ గరిష్ఠ సగటు ప్రయాణికుల సంఖ్యను 75 వేలను కూడా శంషాబాద్ విమానాశ్రయం జనవరి 18న అధిగమించేసింది. ఆ ఒక్కరోజే 94 వేల మంది ఇక్కడి నుంచి రాకపోకలు సాగించారని ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు వెల్లడించారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన వారు కూడా విదేశీ ప్రయాణాలకు ఈ విమానాశ్రయాన్ని ఎంచుకోవడం రాకపోకలు పెరగడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. అలాగే హైదరాబాద్లో తరచూ జాతీయ, అంతర్జాతీయ సదస్సులు జరుగుతుండటం వంటి పరిణామాలు ప్రయాణికుల వృద్ధికి దోహదం చేస్తున్నాయి. హైదరాబాద్ నుంచే దుబాయ్, అబుధాబి, దోహా వంటి పలు విదేశీ నగరాలకు వెళ్లేవారు గణనీయంగా ఉంటున్నారు. దుబాయ్కు నెలకు 93 వేల మంది వెళ్లగా, దోహాకు 42 వేల మంది, అబుధాబీకి 38 వేల మంది, జెడ్డాకు 31 వేల మంది, సింగపూర్కు 31 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని శంషాబాద్ విమానాశ్రయ అధికారులు చెబుతున్నారు.