-
భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు
-
భారీగా ఆలయాల వద్ద బారులు తీరిన భక్తులు
-
ముస్తాబయిన దేవాలయాలు
మహా శివరాత్రిని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఈ నేపథ్యంలోనే ఆలయాలను అందంగా ముస్తాబు చేశారు. ముక్కంటిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరడంతో శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ప్రముఖ క్షేత్రాలు, ఆలయాల్లో శివరాత్రి సందర్భంగా జరిగే ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాల వద్ద అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.
మేళ్లచెర్వులో జాతర వైభవంగా…
యాదాద్రి మహా పుణ్యక్షేత్రంలో అనుబంధంగా కొనసాగుతున్న శ్రీశ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. శివరాత్రి మహోత్సవాల సందర్భంగా యాదాద్రి శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని విద్యుత్ కాంతులతో ముస్తాబు చేశారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వులో జాతర వైభవంగా సాగింది.
పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయంలో….
సూర్యాపేట జిల్లాలోని పిల్లలమర్రి గ్రామంలోని ఎరకేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని సామూహిక అభిషేకాలు నిర్వహించారు. వెయ్యేళ్ల నాటి పిల్లలమర్రి దేవాలయానికి ప్రత్యేక విశిష్టత ఉండటంతో స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా నల్గొండ జిల్లా పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయంలో స్వామివారి కల్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
హనుమకొండలోని చారిత్రక వేయిస్తంభాల గుడిలో
హనుమకొండలోని చారిత్రక వేయిస్తంభాల గుడిలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. శివరాత్రి బ్రహ్మోత్సవాలను శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ప్రారంభించగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, సిపి అంబర్ కిషోర్ ఝా వేడుకల్లో పాల్గొన్నారు. ఆలయాన్ని అధికారులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఒక పక్క ఆలయం విద్యుత్ కాంతులతో విరజిమ్ముతుంటే మరో పక్క నూతనంగా నిర్మించిన కల్యాణ మండపం రంగురంగుల పూలతో కనువిందు చేస్తోంది. శివపార్వతుల కల్యాణంతో నూతనంగా నిర్మించిన కల్యాణ మండపం భక్తులకు అంకితం చేశారు. ఉదయం 4 గంటల నుంచి స్వామి వారికి విశేష పూజలు ప్రారంభమయ్యాయి.
ఐనవోలులో ఘనంగా ఉత్సవాలు
ఐనవోలు మల్లికార్జున స్వామి వారి దేవాలయంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సింహవాహన సేవ అనంతరం ఆలయ ప్రాంగణంలో పెద్దపట్నం నిర్వహించారు. శివరాత్రి వేళ గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున ఐనవోలుకు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
వేములవాడలో మొక్కులు సమర్పించిన మంత్రి
మహాశివరాత్రి సందర్భంగా ఆర్టీసి వరంగల్ రీజియన్ నుంచి ప్రముఖ శైవ క్షేత్రాలు కాళేశ్వరం, వేములవాడ, పాలకుర్తి, రామప్ప ఆలయాలకు ప్రత్యేకంగా బస్సులు నడిపారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామికి ప్రభుత్వ విప్ శ్రీనివాస్తో కలిసి బిసి సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అద్దాల మండపంలో అర్చకులు ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందించారు. ఈ క్రమంలోనే ఆలయంలో మూడు రోజుల పాటు నిర్వహించే శివరాత్రి వేడుకలకు వచ్చే భక్తులకు ఉచిత బస్సు సర్వీసును, అల్పాహారాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు.
కాళేశ్వరంలో శివపార్వతుల కల్యాణోత్సవం ఘనంగా….
ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన కాళేశ్వరంలో మహశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే వేడుకల్లో భాగంగా శుక్రవారం శివపార్వతుల కల్యాణోత్సవం జరిగింది. జగిత్యాల జిల్లా మల్లాపూర్లో గోదావరి తీరానికి వెయ్యి అడుగులు ఎత్తులో ఉన్న శ్రీకనక సోమేశ్వరస్వామి ఆలయం శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పండుగను పురస్కరించుకొని నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. చివరి రోజు స్వామివారి రథయాత్ర జరగనుండగా. శివభక్తులు సైతం ఇక్కడికి పెద్ద ఎత్తున తరలివచ్చి దీక్ష విరమణ చేసి, మొక్కులు చెల్లించుకుంటారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి…
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలోని ప్రసిద్ధ శ్రీస్వయంభూ రాజేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి వేడుకలకు భారీగా భక్తులు హాజరయ్యారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం కేతకి సంగమేశ్వర ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలిరానున్నారు.