విష్ణు మంచు ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలోని అవా మ్యూజిక్ బ్యానర్పై శివ బాలాజీ, మధుమిత సంయుక్తంగా నటించిన జానపద గీతం ‘గోదారికే సోగ్గాన్నే’. రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ పాటను విడుదల చేశారు. ఈ గీతం విడుదల సందర్భంగా శనివారం నాడు శివ బాలాజీ, మధుమిత మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలో శివ బాలాజీ మాట్లాడుతూ .. ‘ఈ పాటలో కంటెంట్ 8 నిమిషాలు ఉంటుంది. పాటలోనే కథ మొత్తం చెప్పాలి. ఈ కాన్సెప్ట్కి మ్యూజికల్ నెరేషన్ అని పేరు పెట్టాను. ముందుగా మేం నటిస్తామని అనుకోలేదు. ఈ కాన్సెప్ట్ నా వద్దకు వచ్చింది. ఆ తరువాత మధుమిత ప్రాజెక్ట్లోకి వచ్చారు. మేం ఇద్దరం సింగిల్ టేక్లో చేశాం. సెట్స్ మీద చాలా ఇంప్రోవైజ్ చేశాం. ఏ షాట్కి కూడా కష్టపడలేదు. ఈ పాటకు రెండు క్లైమాక్స్ ప్లాన్ చేశాం. పాట అద్భుతంగా వచ్చింది. అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.
మధుమిత మాట్లాడుతూ .. ‘సోషల్ మీడియాలోని ఇన్ ఫ్లూయెన్సర్ టాలెంట్ను మరింతగా బయటకు తీసుకు రావాలనే ఉద్దేశంతో ఈ మ్యూజికల్ ఆల్బమ్స్ను స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో నా వద్దకు ఈ పాట వచ్చింది. కాన్సెప్ట్ నాకు చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. జంటగా మమ్మల్ని అందరూ ప్రేమిస్తుంటారు. మళ్లీ ఇన్నేళ్ల తరువాత ఇలా పాటతో జంటగా అందరి ముందుకు రాబోతున్నాం. ఇందులో మాట్లాడిన గోదారి యాస కూడా అద్భుతంగా అనిపిస్తుంది. అందరినీ ఆకట్టుకునేలా ఈ పాట ఉంటుంది’ అని అన్నారు.