420 పేజీల జిరాక్స్ ప్రతులకు రూ.5,850 ఛార్జ్
సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా 420 పేజీల జిరాక్స్ ప్రతుల కోసం దరఖాస్తుదారుడి నుంచి అధికారులు రూ.5,850 వసూలు చేశారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని గుడిపేట గ్రామానికి చెందిన ఎనుగంటి వెంకటరమణ హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. గుడిపేట గ్రామ పంచాయతీ పరిధిలో 2018 నుంచి 2024 వరకు జరిగిన అభివృద్ధి పనులు, అందుకు సంబంధించిన తీర్మాన ప్రతులు, బిల్లుల చెల్లింపు తదితర వివరాలు సమర్పించాలని సమాచార హక్కు చట్టం ద్వారా వినతిపత్రం అందజేశారు. సమాచారం అందించేందుకు 744 జిరాక్స్ ప్రతుల కోసం రూ.5,150, పోస్టల్ ఛార్జీల కింద మరో రూ.700 చెల్లించాలని గ్రామ పంచాయతీ అధికారులు తెలిపారు. ఎనుగంటి వెంకటరమణ రూ.5,850 డీడీని గ్రామ పంచాయతీకి పంపించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి 420 పేజీల జిరాక్స్ ప్రతులను వెంకటరమణకు ఇచ్చారు. సమాచార హక్కు చట్టం నిబంధనల ప్రకారం ఏ-4, ఏ-3 సైజు ఒక్కో జిరాక్స్ కాగితానికి కేవలం రూ.2 మాత్రమే వసూలు చేయాలని, ఆ లెక్కన మొత్తం రూ.840 మాత్రమే అవుతుందని, దానికి విరుద్ధంగా రూ.5,850 వసూలు చేయడం సరికాదని, ఎక్కువ మొత్తంలో వసూలు చేసిన నగదు తిరిగి చెల్లించాలని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని గత నెల 26న జగిత్యాల జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
ఈ విషయమై సమాచార హక్కు చట్టం దరఖాస్తుదారుడి నుంచి ఎక్కువగా వసూలు చేసిన డబ్బులను తిరిగి చెల్లించాలని జిల్లా ఉన్నతాధికారులు మండల స్థాయి అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఎంపీవో ప్రవీణ్ను వివరణ కోరగా, జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు శుక్రవారం గ్రామ పంచాయతీ ఆఫీస్కి వెళ్లి విచారణ చేపట్టి మిగిలిన నగదు దరఖాస్తుదారుడికి చెల్లిస్తామని అన్నారు.