హైదరాబాద్ లో క్యాబ్ డ్రైవర్ల మధ్య నెలకొన్న ప్రాంతీయ విభేదాలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవేధన వ్యక్తం చేశారు. ఏపీ-తెలంగాణ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ గడువు తీరగానే ఏపీ క్యాబ్ డ్రైవర్లు హైదరాబాద్లో ఉండకూడదంటూ తెలంగాణవారు అడ్డుకోవడం సబబు కాదని ఆయన అన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన క్యాబ్ డ్రైవర్లను తెలంగాణ వారు అడ్డుకున్న ఘటనపై పవన్ కళ్యాణ్ ఈ విధంగా స్పందించారు.
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ మంగళవారం అర్జీలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆల్ ఇండియా పర్మిట్ తో తెలంగాణ తాత్కాలిక పర్మిట్ తీసుకుని క్యాబ్లు నడుపుతున్న ఏపీకి చెందిన తమను తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు అడ్డుకుంటున్నారని పలువురు పవన్ దృష్టికి తీసుకువచ్చారు. జూన్ 2 తో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు అయిపోయిందంటూ ఇబ్బంది పెడుతున్నారని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ ఏపీ క్యాబ్ డ్రైవర్లను అడ్డుకోవడం సరికాదన్నారు. మొత్తం రెండు వేల కుటుంబాల వేదన ఇందులో దాగుందని చెప్పారు. రాష్ట్రంలో రాజధాని పనులు ప్రారంభం కాగానే ఇక్కడి క్యాబ్ డ్రైవర్లకు ఉపాధి లభిస్తుందని పవన్ చెప్పారు. అప్పటి వరకూ సాటి డ్రైవర్లను మానవతా దృక్పథంతో చూడాలని తెలంగాణ క్యాబ్ డ్రైవర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ వివాదంపై తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తానని ఏపీ క్యాబ్ డ్రైవర్లకు హామీ ఇచ్చారు పవన్.