ఎస్ఎల్బీసీ టన్నైల్లో మరో పెద్ద ప్రమాదం పొంచి ఉందని తేలింది. సొరంగం కూలిన ప్రాంతంతోపాటు దాదాపు 400 మీటర్ల మేరకు సిమెంట్ సెగ్మెంట్లు కుంగినట్లు, నీటి ఊట పెరింగిందని నిపుణులు గుర్తించారు. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రెస్య్కూ టీం లోపలికి వెళ్తున్నారు. దీంతో సొరంగంలో సహాయక చర్యలు రోజురోజుకు సవాళ్లుగా మారుతున్నాయి. టన్నల్ కుప్పకూలి దాదాపు 10 రోజులు కావస్తున్నా.. సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకీ లభించలేదు. రెస్క్యూ టీమ్స్ శిథిలాలు తొలగించడానికి వెనకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం సొరంగంలో కూలిన శిథిలాలు తీస్తే ఏ క్షణమైనా టన్నల్ కూలిపోయే ప్రమాదం ఉందనే భయం మొదలైంది.
సొరంగం కూలిన ప్రాంతంలోనే కాకుండా అక్కడి నుంచి దాదాపు 400 మీటర్ల వరకూ సిమెంట్ సెగ్మెంట్లు చెదిరినట్టు నిపుణులు గుర్తించారు. వాటి మధ్య నుంచి భారీగా నీటిఊట వస్తున్నదని కార్మికులు, సహాయ బృందాలు తెలిపాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా ప్రాంతాల్లో టన్నల్ కుప్పకూలే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దీంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సహాయ బృందాలు లోపలికి వెళ్తున్నాయి.
ఇన్లెట్ సొరంగంలో 13.931 కిలోమీటరు వద్ద గట్టి రాతి పొరలు కాకుండా పగుళ్లు వచ్చిన రాతిపొరలతోపాటు, వాటి నుంచి భారీ ఎత్తున నీళ్లు రావడంతోపాటు వదులైన మట్టి ఉన్నట్టుగా గతంలోనే గుర్తించారు. ఇలాంటి షియర్ జోన్ 8 మీటర్ల మేర ఉన్నట్టుగా గుర్తించారు. ఊటనీటి పరిమాణాన్ని సరిగా అంచనా వేయకుండా, సరైన నివారణ చర్యలు చేపట్టకుండానే దాదాపు 14 మీటర్ల మేరకు పనులు నిర్వహించారు. ప్రమాదం జరిగిన 13.93 కి.మీ నుంచి ముందున్న దాదాపు 300 మీటర్ల వరకూ సొరంగంలోకి ఆశిథిలాలు ముందుకు వచ్చినట్టు నిపుణులు అంచానా వేశారు. దీనిపై నిపుణులు, ఇంజినీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెస్క్యూ టీంలు సొరంగంలోనికి వెళ్లాలంటే జంకుతున్నారు. ఈ విషయం ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు తీసుకెళ్లారు. దీంతో మనుషులతో కాకుండా రోబోలతో సహాయక చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.