- ఎస్ఎల్బిసి టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్
- సహాయక చర్యల పురోగతిపై సమీక్ష
ఎస్ఎల్బిసి సొరంగంలో సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తూ శిథిలాలను తొలగిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. మట్టి, నీటి తొలగింపు పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. బుధవారం డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో సహాయక బృందాలు కొనసాగిస్తున్న పనులను విభాగాల వారీగా విశ్లేషించారు. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కల్నల్ పరీక్షిత్ మెహర టన్నెల్ బోరింగ్ మెషిన్ నమూనా తో అధికారులకు టన్నెల్ లోపల కొనసాగుతున్న సహాయక చర్యలను వివరించారు. టన్నెల్ బోరింగ్ మిషన్ చివరి భాగంలోని శిథిలాలను తొలగించామని, రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్న సహాయక బృందాలు మట్టితీత పనులు వేగంగా జరుగుతున్నాయని, ది వాటరింగ్ ప్రక్రియ వేగంగా జరుగుతుందని తెలిపారు.
టన్నెల్ బోరింగ్ మిషన్ ఎడమవైపు నుంచి వాటర్ జెట్ ల ద్వారా బురదను తొలగించే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్న సహాయక బృందాలు సమన్వయంతో నిరంతరం శ్రమిస్తున్నాయని వివరించారు. రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్న సహాయక బృందాలు తోపాటు దిల్లీ నుంచి వొచ్చిన నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రతినిధుల బృందం, ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాద ప్రదేశంలో రోబోటిక్ సేవల కోసం హైదరాబాద్ కు చెందిన ఎన్వి రోబోటిక్స్ ప్రతినిధుల బృందం టన్నెల్లోకి వెళ్లినట్లు తెలిపారు.
టన్నెల్ బోరింగ్ మిషన్ ఎడమవైపు నుంచి వాటర్ జెట్ల ద్వారా బురదను తొలగించే పనులు ఎస్డిఆర్ఎఫ్ బృందాల ద్వారా వేగంగా జరుగుతున్నాయని వివరించారు. టన్నెల్ లోపల ఉన్న టన్నెల్ బోరింగ్ మిషన్ పై పేరుకుపోయిన మట్టిని తొలగించేందుకు వాటర్ జెట్ ల ను ఉపయోగించుకున్నట్లు వాటి పని తీరును అధికారులకు డెమో ద్వారా వివరించారు. కన్వేయర్ బెల్టు పునరుద్ధరించామని దానికి సంబంధించిన కమిషనింగ్ పని పూర్తి చేస్తున్నట్లు, రెస్క్యూ ఆపరేషన్ లో ఎదుర్కొంటున్న ఆటంకాలను అధిగమిస్తున్నామని చెప్పారు. టన్నెల్ లోపల వెంటిలేషన్, లైటింగ్ సదుపాయాలను ముందుకు పొడిగించినట్లు తెలిపారు.
సమావేశంలో ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి, టీఎస్ఎస్పీడీసీఎల్ సిఎండి ముషారఫ్ అలీ, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, కల్నల్ పరీక్షిత్ మెహ్ర, ఎన్డీఆర్ఎఫ్ అధికారి ప్రసన్న, హైడ్రా, సింగరేణి మైన్స్ రెస్క్యూ, ఎస్డీఆర్ఎఫ్ అధికారి, ఫైర్ సర్వీసెస్, దక్షిణ మధ్య రైల్వే ప్లాస్మా కట్టర్స్, ర్యాట్ మైనర్స్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా లక్నో డైరెక్టర్ అయోధ్య ప్రసాద్ తప్లియాల్,, హైదరాబాదు డైరెక్టర్ శైలేంద్ర కుమార్, దక్షిణ మధ్య రైల్వే డివిజన్ మెకానికల్ ఇంజనీర్ మురళీ తదితరులు పాల్గొన్నారు.