మలక్పేట్లో ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎస్ఈ) నూనె శ్రీధర్ నివాసంలో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. కరీంనగర్లో శ్రీధర్ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు హైదరాబాద్ తరలించారు. ఏసీబీ సోదాల్లో శ్రీధర్ ఆస్తుల చిట్టా మొత్తం బయటకు వస్తోంది. మార్చి 2న ఓ ఫామ్ హౌస్లో శ్రీధర్ తన కుమారుడి హల్దీ, సంగీత్ ఫంక్షన్లను ఘనంగా నిర్వహించారు. అంతేకాకుండా మార్చి 6న థాయిలాండ్లో కొడుకు వివాహం జరిపించారు. అలాగే మార్చి 9న నాగోల్లోని శివం కన్వెన్షన్ హాల్లో ఎంతో వైభవంగా రిసెప్షన్ను చేశారు. కొడుకు వివాహం కోసం పెద్ద మొత్తంలో కోట్ల రూపాయలు గుమ్మరించినట్లు ఏసీబీ గుర్తించింది. శ్రీధర్ ముందు పలు డాక్యుమెంట్లను పెట్టి మరీ ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. శ్రీధర్ కూడబెట్టిన ఆస్తులపై ఏసీబీ అధికారులు దృష్టిసారించారు.
కాగా.. గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్ద పనిచేసిన శ్రీధర్పై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించి ఆస్తుల కేసును నమోదు చేశారు. బుధవారం ఉదయం నుంచి తెలంగాణలో శ్రీధర్కు సంబంధించి 20 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇరిగేషన్ సీఏడీ డివిజన్ 8లో శ్రీధర్ పనిచేస్తున్నారు. చొప్పదండిలోని ఎస్సారెస్పీ క్యాంపు కార్యాలయంలో ఆయన విధులు నిర్వహిస్తున్నారు. ఇరిగేషన్ శాఖలో ప్రాజెక్టులు కట్టబెట్టి వందల కోట్లు సంపాదించారన్న ఆరోపణలపై సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్, కరీంనగర్, బెంగళూరులో సోదాలు జరుగుతున్నాయి. బెంగళూరులో నాలుగు చోట్ల హైదరాబాద్లో ఆరు చోట్ల, కరీంనగర్లోని కాలేశ్వరం ప్రాజెక్ట్ కార్యాలయంతో పాటు తొమ్మిది చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. శ్రీధర్కు సంబంధించిన బంధుమిత్రులు, కుమారుడితో పాటు తన సన్నిహితుల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. కాళేశ్వరంలో కీలకమైన గాయత్రీ పంప్ హౌస్ బాధ్యతలను శ్రీధర్ చూశారు. గాయత్రీ పంప్ హౌస్లను బాహుబలి మోటార్లుగా భావించింది గత ప్రభుత్వం. చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలంలో భారీ పంప్ హౌస్లు నిర్మించిన విషయం తెలిసిందే.