అభివృద్ధిపై ఫోకస్ పెడదాం
కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతోనే అబివృద్ధి
కేంద్రం పక్షాన సంపూర్ణ సహకారం…బాధ్యత తీసుకుంటా
గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర, దేశాభివృద్ధి
కులంలో పేదలను ఆదుకుంటేనే కుల సంఘాలకు మనుగడ
కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
ఎన్నికలైపోయినందున ఇకపై ఒకరినొకరు తిట్టుకోవడం బంద్ చేద్దామని, రాజకీయ విమర్శలు, ఆరోపణలను పక్కనపెట్టి అభివృద్ది పైనే ఫోకస్ చేద్దామని అన్ని పార్టీలకు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సూచించారు. కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతోనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యమని, గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి సాధ్యమని, ఈ విషయంలో కేంద్రం పక్షాన సంపూర్ణ సహకారం అందించే బాధ్యత తాను తీసుకునేందుకు సిద్ధమని కేంద్ర బండి సంజయ్ అన్నారు. సోమవారం సిరిసిల్లకు విచ్చేసిన బండి సంజయ్కు బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా పట్టణంలోని మున్నూరుకాపు సంఘ కల్యాణ మండపానికి రూ.10 లక్షల ఎంపీ లాడ్స్ నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కల్యాణ మండపం ఆవరణలో మొక్క నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బండి సంజయ్ను సంఘం నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ…కుల సంఘం ఆఫీస్ను నిర్మిస్తే ఆ సంఘంలోని నాయకులకే ఉపయోగపడుతుందని, కానీ కుల సంఘాల తరపున కల్యాణ మండపాలు నిర్మిస్తే ఆ కులంలోని ప్రతి ఒక్కరికీ ఉపయోగపడుతుందని, ఇలాంటి వాటికి మాత్రమే ఎంపీ లాడ్స్ నిధులిస్తున్నామన్నారు. ఏ కుల సంఘమైనా సరే…ఆ కులంలోని పేదలకు సహాయ సహకారాలు అందిస్తూ ఆదుకున్నప్పుడు మాత్రమే కుల సంఘాలకు మనుగడ ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
తాను వారిలో ఒకడినిని, మున్నూరు కాపు సంఘం చేపట్టే ప్రజోపయోగ పనులకు తనవంతు పూర్తి సహాయ సహకారాలందించేందుకు సిద్ధంగా ఉన్నానని, మున్నూరుకాపు సంఘం పెద్దల ప్రతిపాదన మేరకు కంపౌండ్ వాల్ నిర్మాణానికి సహకరిస్తానని బండి సంజయ్ తెలిపారు. రెండోసారి ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపించడంలో సిరిసిల్ల జిల్లా ప్రజల భాగస్వామ్యం ఉందని, గెలవడంవల్లే మోదీ కేబినెట్లో చోటు దక్కిందని, జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని బండి హామీ ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వం విద్య, వైద్యం, రవాణా, జాతీయ రహదారులు, రైల్వేశాఖలతోపాటు సంక్షేమ రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని, ఆయా రంగాల నుండి నిధులు తీసుకొచ్చి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతోనే గ్రామాలు అబివృద్ధి చెందుతాయని, కేంద్ర ప్రభుత్వం తరపున రాష్ట్రానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించే బాధ్యత తీసుకుంటానని అన్నారు. ఈ సమావేశంలో బిజెపి నాయకులు రాణి రుద్రమ, ఎర్రం మహేశ్, మున్నూరు కాపు సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశానంతరం బండి సంజయ్ వీర్నపల్లి మండలంలో పర్యటించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది.