పేద, మధ్య తరగతి, యువత, రైతు సంక్షేమానికి ప్రాధాన్యం
రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు విప్లవాత్మకం
తెలంగాణ సహా దేశంలోని ఒక్కో ఉద్యోగికి రూ.80 వేల వరకు ఆదా
బడ్జెట్ 2025పై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ హర్షం
కేంద్ర బడ్జెట్ కూర్పు అద్బుతంగా ఉందని, పేద, మధ్యతరగతి, రైతులు, చిరు వ్యాపారుల, యువ పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా కేటాయింపులు చేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. పార్లమెంట్లో నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2025పై ఆయన స్పందించారు. మధ్యతరగతి ఉద్యోగుల, వ్యాపారులకు ఈ బడ్జెట్ ఒక వరం అని, ఉద్యోగులకు రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం విప్లవాత్మక చర్య అని అన్నారు. గత 75 ఏళ్లలో మధ్య తరగతి ప్రజల కోసం ఇంత అనుకూలమైన బడ్జెట్ ఎన్నడూ రాలేదన్నారు. అలాగే ఇది సంస్కరణల బడ్జెట్.
2027 నాటికి అమెరికా, చైనా తర్వాత భారత్ ను మూడో ఆర్ధిక వ్యవస్థగా అవతరించే ఆ దిశగానే ఈ బడ్జెట్ ను రూపొందించడం గొప్ప విషయం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఇంత గొప్ప బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ప్రత్యేక ధన్యవాదాలు. బీజేపీ ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజల పక్షపాతి అనడానికి నిదర్శనమిది. తెలంగాణ సహా దేశంలో రూ.4లక్ష లోపు జీతభత్యాలు పొందే ఉద్యోగులంతా ఇకపై పన్ను కట్టాల్సిన అవసరం లేకపోవడం గొప్ప విషయం. తద్వారా ఒక్కో ఉద్యోగికి సగటున రూ.80 వేలు ఆదా అయ్యే అవకాశముంది. పేద, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేసే టీవీ, మొబైల్స్, లెదర్ ఉత్పత్తుల ధరలను భారీగా తగ్గబోతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలపై ధరలు కూడా తగ్గుతున్నాయి. తద్వారా కాలుష్యం తగ్గే అవకాశముంది.
కేన్సర్, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులు వాడుతున్న ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీని భారీగా తగ్గించడం వల్ల ఆయా రోగాలకు చికిత్స వ్యయం చాలా వరకు తగ్గే అవకాశముంది. ఆర్ధిక వ్యవస్థను స్థిరంగా ఉంచడంతో పాటు వ్యవసాయం, ఉత్పత్తి, సేవా రంగాలను బ్యాలెన్స్ చేసే బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్ రైతులకు వరం. 7.7 కోట్ల మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల పేరిట రుణాలివ్వడమే లక్ష్యంగా పెట్టుకోవడం గొప్ప విషయం. తెలంగాణలోని దాదాపు 50 లక్షల మంది రైతులకు రూ.5 లక్షల వరకు బ్యాంకుల ద్వారా క్రెడిట్(రుణం) లభించే అవకాశముంది. ప్రైవేట్ వ్యాపారస్తుల, దళారుల వద్ద చేయిచాపే దుస్థితి లేకుండా చేసేందుకు కిసాన్ క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టారు. తక్షణమే తెలంగాణలోని రైతన్నలంతా ఈ కిసాన్ క్రెడిట్ కార్డుల మంజూరు కోసం దరఖాస్తు చేసుకుని లబ్ది పొందాలని బండి సంజయ్ కోరారు.
వివిధ రకాల పంట ఉత్పత్తులను పెంచి రైతులను అధిక ఆదాయం తెచ్చేలా చేసేందుకు నూతనంగా ‘ధన ధాన్య కృషి యోజన పథకం’ను ప్రవేశపెట్టడం హర్షణీయం. పప్పు దినసుల కోసం ప్రత్యేక కమిషన్ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతోపాటు జాతీయ పత్తి కమిషన్ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించడం తో తెలంగాణ లో పత్తి, పప్పు దినుసులు పండిస్తున్న రైతులకు అధిక ప్రయోజనాలు కలిగే అవకాశం రావడంతోపాటు గిట్టుబాటు ధర పెరిగే అవకాశముంది. ఉపాధి అవకాశాలను పెంచి యువతను వ్యాపార, పారిశ్రామికవేత్తలను చేసేందుకు బడ్జెట్ లో వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారులు, ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలు, వ్యాపారులకు రుణ పరిమితిని పెంచడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఎంస్ఎంఈ రుణాలను రూ.5 కోట్ల నుండి రూ.10 కోట్లకు పెంచడంతోపాటు స్టార్టప్ లకు రూ.20 కోట్ల వరకు రుణాలిస్తామని బడ్జెట్లో పేర్కొనడం ద్వారా యువతకు ఎంతో ప్రయోజనం కలగబోతోంది.
విద్యుత్ రంగంలో పెను మార్పులు తీసుకొచ్చి ప్రజలకు చౌక ధరకే కరెంట్ ను అందుబాటులోకి తెచ్చే విధంగా బడ్జెట్ ను రూపొందించడం గొప్ప విషయం. గ్రామాల్లో వలసలను నివారించేందుకు ప్రత్యేక ప్రణాళికలను బడ్జెట్ లో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ గారు పట్టణాలను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు బడ్జెట్ లో కేటాయింపులు చేయడం సంతోషంగా ఉంది. పట్టణ అభివృద్ధికి నరేంద్రమోదీ ప్రభుత్వం చేస్తున్న క్రుషిలో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యం కావాలని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కోరారు.