- బిఆర్ఎస్ కథ ముగిసిపోయింది,
- అధికారం పోయాక వినోద్కుమార్ సుద్దపూసలా మాట్లాడుతున్నారు
- ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
గత పదేళ్లలో బిఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు అప్పుడు ఆ పార్టీ నాయకులకు తెలియదా అంటూ ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆరోపించారు. కరీంనగర్లో దొరికిన డబ్బు తనది కాదనీ వినోద్కుమార్ ప్రమాణం చేస్తారా అంటూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ కథ ముగిసిపోయింది, అధికారం పోయాక వినోద్కుమార్ ఇప్పుడు సుద్దపూసలా మాట్లాడుతున్నారని ఆది శ్రీనివాస్ అన్నారు. పదేళ్ల పాటు కెసిఆర్ విచ్చలవిడిగా ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టినప్పుడు వినోద్కుమార్కు అది కనిపించలేదా అని ఆయన ప్రశ్నించారు. కెసిఆర్కు సన్నిహితుడైన వినోద్కుమార్కు పార్టీ ఫిరాయింపులు రాజ్యాంగ వ్యతిరేకమని తెలియదా అప్పుడు ఆయనకెందుకు చెప్పలేదన్నారు. న్యాయవాది అయిన వినోద్కుమార్కు రాజ్యాంగం గురించి పదేళ్లలో తెలియరాలేదన్నారు. అనర్హత పిటిషన్లపైన త్వరగా నిర్ణయం తీసుకోవాలని గత స్పీకర్లు మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్ రెడ్డికి వినోద్ రావు ఎందుకు సలహా ఇవ్వలేదన్నారు. ఐదేళ్ల పాటు అనర్హత పిటిషన్లపైన స్పీకర్లు తేల్చకపోతే ఆయన కనీసం ఒక్క మాటైనా ఎందుకు మాట్లాడలేదన్నారు. రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న కల్వకుంట్ల కుటుంబాన్ని ఎందుకు నిలదీయలేదని ఆయన అన్నారు.