-
రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయండి
-
సిఎం రేవంత్రెడ్డిని కోరిన డిప్యూటీ కలెక్టర్స్,, తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్
రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థలను బలోపేతం చేయాలని తెలంగాణ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వి.లచ్చిరెడ్డి, కె.రామకృష్ణ, ఎన్.ఆర్ సరిత, తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.రాములు, రమేష్ పాక, అసోసియేట్ ప్రెసిడెంట్ పూల్సింగ్లు విజ్ఞప్తి చేశారు. ఆదివారం డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్, తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ ప్రతినిధులు సంయుక్తంగా సిఎం రేవంత్రెడ్డిని కలిసి రెవెన్యూ వ్యవస్థ బలోపేతంకు చేపట్టాల్సిన చర్యలు, పూర్వ విఆర్ఓ, విఆర్ఏల పెండింగ్ సమస్యలు, తహసీల్దార్ల అద్దె వాహనాలకు బిల్లుల చెల్లింపు, క్యాడర్ స్టెంన్ పెంపు, తదితర అంశాలను సిఎం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు కావాలంటే రెవెన్యూ విభాగాన్ని బలోపేతం చేయాలని వారు సిఎంను కోరారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ ఉద్యోగి ఉండేలా చర్యలు చేపట్టాలని, గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేయాలని వారు కోరారు. గతంలో మాదిరిగా గ్రామ, మండల స్థాయిల్లో ఉద్యోగుల సంఖ్యను పెంచాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రజల సౌకర్యార్ధం రెవెన్యూ పరిపాలనలో తీసుకురావాల్సిన మార్పులకు సంబంధించిన అంశాలను సిఎంకు వారు వివరించారు. రూరల్, సెమీ రూరల్, అర్బన్గా మూడు స్థాయిలుగా విభజిస్తే ప్రజలకు సేవలు సులభంగా, వేగంగా అందుతాయని వారు సిఎంతో తెలిపారు.
అదనపు కలెక్టర్ల పోస్టులను రెవెన్యూ పరిధిలోకి తీసుకోవాలి….
పూర్వ విఆర్ఓల సమస్యలు నేటికి పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేదని వారు సిఎంకు ఫిర్యాదు చేశారు. దీంతో రాష్ట్రంలో 5,576 మంది పూర్వ విఆర్ఓలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు గుర్తు చేశారు. గత సర్వీసును సైతం పరిగణలోకి తీసుకొని ముఖ్యంగా సీనియారిటీ, ప్రమోషన్లు ఉండేలా చూడాలని వారు కోరారు. ఇదే విధంగా పూర్వ విఆర్ఏల సమస్యలు సైతం పెండింగ్లోనే ఉన్నాయన్నారు. వారిని సర్దుబాటు పేరుతో వివిధ జిల్లాలకు పంపించి ఆ తర్వాత గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. మీరైనా వారి అన్ని రకాల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని వారు కోరారు. అదనపు కలెక్టర్ల పోస్టులకు సంబంధించి జీఏడి పరిధిలో ఉందన్నారు. ఈ విధంగా కాకుండా దీనిని రెవెన్యూ విభాగం పరిధిలోకి తీసుకోవాలని వారు కోరారు.