-
ఆ ఎమ్మెల్యేల కేసులో హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ
-
దానం-కడియం-తెల్లం కేసులో ఏక్షణంలోనైనా తీర్పు
తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు సంబందంచి హైకోర్టు ఏం తీర్పు చెప్పబోతోందన్న ఆసక్తి రాజకీయవర్గాల్లో నెలకొంది. తమ పార్టీ సింబల్ పై గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా శాసనసభ స్పీకర్కు ఆదేశాలివ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ ముగిసింది. ఈ పిటీషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ విజయసేన్ రెడ్డి బెంచ్.. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదులను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని అసెంబ్లీ స్పీకర్ కు ఉత్తర్వులు జారీ చేస్తామని.. దీనిపై మీ వైఖరి చెప్పాలని అడ్వకేట్ జనరల్ను హైకోర్టు ప్రశ్నించింది.
ఐతే విశేష అధికారాలున్న శాసనసభ స్పీకర్ కు కోర్టులు ఆదేశాలు జారీ చేయరాదన్నదే తమ వాదన అని అడ్వకేట్ జనరల్ స్పష్టం చేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం ఉత్తర్వుల మేరకు పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై పిటిషన్లను మూడు నెలల్లోగా పరిష్కరించాలని బీఆర్ఎస్ తరపు అడ్వకేట్లు వాదించారు. బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ కు విచారణార్హత లేదని, కోర్టు ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామని అడ్వకేట్ జనరల్ వాదించారు.
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ లు రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరారని బీఆర్ఎస్ తరఫు న్యాయవాది కోర్టు ముందు తమ వాదనలు వినిపించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఒకరైన దానం నాగేందర్ అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ఇలాంటి కేసులో మణిపూర్ హైకోర్టు స్పీకర్ కు ఆదేశాల్చిన ఉత్తర్వులను కోర్టుకు సమర్పించారు. ఐతే న్యాయస్థానాలు స్పీకర్ కి ఆదేశాలు ఇవ్వడం వీలు పడదంటూ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల తరఫున హాజరైన న్యాయవాది వాదనలు వినిపించారు.
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసుకు సంబందించి ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేల అనర్హతపై పిటీషన్లను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకునేందుకు స్పీకర్ కు మరికొంత సమయం పడుతుందని కోర్టుకు విన్నవించారు. ఇరు పక్షాల వాదనల విన్న తరువాత తీర్పును రిజర్వ్ చేసింది కోర్టు. దీంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసులో హైకోర్టు ఏంతీర్పు చెప్పబోతోందన్న ఆసక్తి నెలకొంది.