-
పాఠశాలల్లో మౌళిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోండి
-
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాల్సిందే
-
మౌళిక సదుపాయాల ఏర్పాటు, పర్యవేక్షణ స్వయం సహాయక సంఘాలకు
-
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచిత విద్యుత్
-
అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాల కల్పనకు పూర్తి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో స్పష్టమైన మార్పు కనిపించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం కలిగించేలా చర్యలుండాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు తక్షణమే ఉచిత విద్యుత్ అమలయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంసీహెచ్ఆర్డీలో ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. విద్యార్థులకు యూనిఫామ్ తో పాటు పాఠశాలల్లో మౌళిక సదుపాయాల ఏర్పాటు, పర్యవేక్షణను స్వయం సహాయక మహిళా సంఘాలకు అప్పగించే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
దీని ద్వారా స్కూల్స్ పైన నిరంతర పర్యవేక్షణ ఉండటంతో పాటు మహిళలకు ఆర్థికంగా చేయూతను అందించినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇతర రాస్ట్రాల ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాలను పరిశీలించి రాష్ట్రంలో అమలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. గ్రీన్ ఛానెల్ ద్వారా పాఠశాలల్లో మౌళిక సదుపాయాల కోసం నిధులు మంజూరు చేయాలని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాల్లో డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేయాలన్నారు. టీ-శాట్ ద్వారా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో డిజిటల్ పాఠాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సోలార్ ప్యానెల్ల ఏర్పాటుపై దృష్టిసారించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు CSR ఫండ్స్ కోసం ప్రయత్నం చేయాలని, సౌకర్యాల మెరుగుపరిచేందుకు NRI ల సహాకారం తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచాలని సీఎం సూచించారు. వేసవి సెలవులు ముగిసేలోగా పాఠశాలల్లో పనులు పూర్తి చేయాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీపై సమగ్ర అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. విద్యావేత్తలు, మేధావులతో చర్చించాలని ఆయన సూచించారు.
స్కిల్ యూనివర్శిటీ కోసం ఐఎస్బీ తరహాలో గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేయాలన్నారు. న్యాక్ పై పూర్తిస్థాయిలో దృష్టిసారించాలన్నారు. సచివాలయం నుంచి కిందిస్థాయి వరకు ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ సిస్టం (FRS) తీసుకు వచ్చే యోచనపైనా సమావేశంలో చర్చ జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత శాఖల అధికారులు.