Monday, June 2, 2025

యాదాద్రిలో చింతపండు దొంగలు ఐదు నెలలుగా పెద్ద స్కెచ్‌

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలోని ప్రసాద విక్రయశాలలో జరిగిన చోరీ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకొస్తోంది. ఈ కేసులో మధు అనే ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రసాదానికి సంబంధించిన సామానులను తరలించేందుకే కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దొంగతనానికి వినియోగించిన కారును శామీర్​పేట్​కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి నుంచి తొలుత అలియాబాద్​కు చెందిన సందీప్ అనే యువకుడు 2024 సెప్టెంబర్​లో రూ.70 వేలకు కొనుగోలు చేశారు. అనంతరం సందీప్ ఆ కారుకు మరమ్మతులు చేసి నిందితుడు మధుకు నవంబర్​లో రూ.80 వేలకు విక్రయించారు.
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంమే : మధు చిన్నతనంలోనే తన తండ్రిని కోల్పోయాడు. దీంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. మధు తన నానమ్మ చనిపోయిన నాలుగు రోజులకే ఈ కారు కొనుగోలు చేశాడు. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు అతడిని ఆరాతీయగా, యాదగిరిగుట్ట దేవస్థానంలో పని చేస్తున్న ఓ పూజారి తనకు ఈ కారును బహుమతిగా ఇచ్చినట్లు ఇంట్లో వారిని నమ్మించాడు. కొనుగోలు అనంతరం ఆ కారు అద్దాలకు మార్పులు చేశాడు. కారులోని వ్యక్తులు, అందులోని వస్తువులు బయట వారికి కనబడకుండా అద్దాలకు పూర్తిగా బ్లాక్ ఫిలిం వేయించాడు. రెండున్నర సంవత్సరాలుగా ఉద్యోగంలో! : ఈ కేసులో ప్రధాన నిందితులు మధు, గణేష్ గత రెండున్నర సంవత్సరాలుగా ప్రసాద తయారీ కేంద్రంలో పనిచేస్తున్నారు. దానికి తోడు వారిద్దరిదీ పక్కపక్క గ్రామాలు కావడంతో వారి మధ్య మరింత స్నేహం బలపడింది. కారు అద్దాలకు బ్లాక్ ఫిలిం వేసి ఐదు నెలలు గడుస్తోంది. అంటే గత ఐదు నెలలుగా ప్రసాద తయారీ సామాగ్రి తరలింపు వ్యవహారం నడుస్తుందనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి.
అధికారుల పాత్రలేనిదే ఇది సాధ్యమవుతుందా? : ఈ కారును పూజారి బహుమతిగా ఇచ్చాడని కుటుంబసభ్యులను నమ్మించాడనే అంశాన్ని లోతుగా పరిశీలిస్తే, కారు కొనుగోలు చేసే స్తోమత మధు కుటుంబానికి లేదని పోలీసులు గుర్తించారు. మరోవైపు ఈ చోరీల వెనుక పూజారి హస్తం ఖచ్చితంగా ఉందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత ఐదు నెలలుగా సాగుతున్న ఈ వ్యవహరంలో ఉన్నతాధికారులు, పూజారుల పాత్ర లేనిదే ఈ దొంగతనాలు సాధ్యం కాదని పలు రాజకీయ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. గత ఐదు నెలలుగా ఈ కారు కొండ పైకి ఎన్ని సార్లు వచ్చింది? అసలు ఈ కారు మధుకి చెందిందా? లేక పూజారికి చెందిందా? అనే కోణంలో విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై దేవస్థానం నియమించిన కమిటీ, పోలీసులు క్షుణంగా విచారణ చేసి చోరీలో పాల్గొన్న అసలైన నిందితులను పట్టుకోవాలని కోరుతున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

సొంత పార్టీ వాళ్లే ఎంపీగా ఓడించారన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com