- హస్తిన కొత్త ముఖ్యమంత్రిగా ఆతిశీ
- సీఎం పదవికి రాజీనామా చేసిన కేజ్రీవాల్
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆతిశీ సింగ్ ఎంపికయ్యారు. ఆతిశీ సింగ్ పేరును అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించారు. కేజ్రీవాల్ ప్రతిపాదనకు ఆప్ శాసనసభాపక్షం ఆమోదం తెలిపింది. కాగా, ప్రస్తుతం ఆతిశీ దిల్లీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు కేజ్రీవాల్ నివాసంలో జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ఆతిశీ పేరును ముఖ్యమంత్రిగా ఖరారు చేశారు. ఆతిశీ పేరును కేజ్రీవాల్ ప్రతిపాదించగా ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. షీలా దీక్షిత్ తర్వాత దిల్లీలో మహిళా సీఎంగా ఆతిశీ బాధ్యతలు స్వీకరించనున్నారు. దిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రిగా ఆతిశీ విధులు నిర్వర్తించనున్నారు.
సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. మంగళవారం సాయంత్రం గవర్నర్ వీకే సక్సేనాను కలిసిన కేజ్రీవాల్ తన రాజీనామా లేఖను సమర్పించారు. కాగా, రెండు రోజుల క్రితమే సీఎం పోస్టుకు రాజీనామా చేస్తానని ప్రకటించిన కేజ్రీవాల్..తాజాగా నిర్ణయం తీసుకున్నారు.
తీవ్ర ఆగ్రహంలో ప్రజలు: ఆతిశీ
దిల్లీ కొత్త సీఎంగా ఎంపికైన ఆతిశీ సింగ్ తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. అరవింద్ కేజ్రీవాల్కు ధన్యవాదాలు తెలిపారు. ఆయన్ను మళ్లీ ముఖ్యమంత్రిగా తీసుకురావడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. తన లాంటి ఫస్ట్టైమ్ పొలిటిషియన్కు ఇలాంటి బాధ్యతలు అప్పగించడం ఆమ్ ఆద్మీ పార్టీలోనే సాధ్యం అని అన్నారు. కేజ్రీవాల్ రాజీనామాపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వ్యాఖ్యానించారు.
“ముఖ్యమంత్రిగా నాతో పాటు దిల్లీ ప్రజలు, ఆప్ ఎమ్మెల్యేలు ఒకే లక్ష్యంతో ఎన్నికల వరకు పనిచేస్తాం. మేము దిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ను మళ్లీ గెలిపించాలి. కేజ్రీవాల్ నన్ను నమ్మారు. ఎమ్మెల్యే, మంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రిని చేశారు. నేను ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఫస్ట్టైమ్ పొలిటిషియన్స్ కేవలం ఆప్లో మాత్రమే ఇలాంటి అవకాశాలను పొందగలరు. నేను వేరే పార్టీలో ఉంటే ఇలా జరిగేది కాదు. నేను సంతోషంగా ఉన్నాను. మరోవైపు మా అన్నయ్య(కేజ్రీవాల్) రాజీనామా చేస్తుండటం వల్ల బాధగా ఉంది. ఇది, కేజ్రీవాల్ రాజీనామా చేసే బాధాకరమైన క్షణం కాబట్టి నాకు పూలమాలలు, అభినందనలు తెలపవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఈ బాధ్యత తీసుకున్నంత కాలం నా లక్ష్యం ఒక్కటే. దిల్లీ ప్రజలను రక్షించడానికి అరవింద్ కేజ్రీవాల్ మార్గదర్శకత్వంలో ప్రభుత్వాని నడపడానికి ప్రయత్నిస్తాను.” అని ఆతిశీ అన్నారు.
ముందుగానే ప్రకటన
మద్యం విధానం కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు గత శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఆదివారం పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించిన కేజ్రీవాల్ 2 రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. న్యాయస్థానం నుంచి న్యాయం దక్కిందనీ, ప్రజల నుంచి న్యాయం జరగాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. ప్రజలు తమను నిజాయతీ పరులుగా అంగీకరించేవరకు సీఎం సీటులో కూర్చోబోనని కేజ్రీవాల్ చెప్పారు. ఈ క్రమంలో తదుపరి సీఎం రేసులో పార్టీ కీలక నేతలు ఆతిశీ, సౌరభ్ భరద్వాజ్, రాఘవ్ చద్దా, కైలోశ్ గహ్లోత్తో పాటు కేజ్రీవాల్ సతీమణి సునితా కేజ్రీవాల్ పేర్లు వినిపించాయి. ఈ రెండు రోజులు పార్టీ ముఖ్యనేతలతో కేజ్రీవాల్ అనేక సమావేశాలు నిర్వహించారు. చివరికి ఆతిశీని ముఖ్యమంత్రిగా ఆప్ ఎంపిక చేసింది. మంగళవారం సాయంత్రం నాలుగున్నరకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసి కేజ్రీవాల్ తన రాజీనామాను సమర్పించనున్నారు.
‘సునీతాకు ఇంట్రెస్ట్ లేదు’
అంతకుముందు, ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎంపిక చేసే విషయంపై ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ మట్లాడారు. మంత్రి మండలి నుంచి ఎవరో ఒకరు సీఎం అయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల గురించి నాకు అర్థమైనంత వరకు సునీతా కేజ్రీవాల్ సీఎం అయ్యే ఛాన్స్ లేదని చెప్పారు. ఆమెకు ఆసక్తి లేదని చెప్పారు.
ప్రమాణ స్వీకారం ఎప్పుడు..?
సెప్టెంబరు 26, -27 తేదీల్లో ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఆ సమయంలోనే ఆతిశీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు ఆప్ వర్గాలు వెల్లడించాయి. ఈసారి డిప్యూటీ సీఎంగా ఎవరినీ ప్రకటించే అవకాశాలు లేవని తెలుస్తోంది.
ఫస్ట్ టైం ఎమ్మెల్యే.. వెంటనే సీఎం..
ప్రస్తుతం కేజ్రీవాల్ కేబినెట్ లో విద్యాశాఖ,పర్యాటక శాఖ సహా మొత్తం 5 శాఖల మంత్రిగా ఉన్న అతిషినే ఢిల్లీ కొత్త సీఎంగా ఎంపిక చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బెయిల్ పై తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్ విడుదలవడం..ఆ తర్వాత ఆయన రాజీనామా చేస్తానని ప్రకటించడం.. ఇప్పుడు ఢిల్లీకి కొత్త సీఎం ఎంపిక అన్నీ చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం కేజ్రీవాల్ కేబినెట్ లో విద్యాశాఖ,పర్యాటక శాఖ సహా మరికొన్ని కీలక శాఖల మంత్రిగా ఉన్న అతిషినే ఢిల్లీ కొత్త సీఎంగా ఎంపిక చేసింది. తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆమెను సీఎం పదవి వరించింది. అరవింద్ కేజ్రీవాల్కు ఉన్న నమ్మకం, సాన్నిహిత్యం కాకుండా, బ్యూరోక్రసీతో మంచి సంబంధాలు, అనేక ఇతర అంశాలు అతిషిని కలిసి వచ్చిన అంశాలు.
ముఖ్యంగా ఆప్ నేతలలో చాలామంది ముఖ్యులకు బ్యూరోక్రసీతో సమస్య ఉండేది..కానీ అతిషికి మాత్రం వారికి మంచి రిలేషన్ ఉండేది. ఇది ఆమెకు అతిపెద్ద అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఆప్ గెలిస్తే పవర్ ఎక్సేంజ్ విషయంలో అతిషి ఎలాంటి ఇబ్బందులు రావని గ్రహించే కేజ్రీవాల్ ఆమెను ఎంపిక చేసుకున్నట్లు అర్థమవుతోంది. ఆ తర్వాత ఢిల్లీ బాధ్యతను తనకు అప్పగించిన కేజ్రీవాల్ కు ధన్యవాదాలు చెప్పిన అతిషి..కేజ్రీవాల్ రాజీనామాతో తాను వ్యక్తిగతంగా బాధపడ్డానని తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు అయ్యేవరకు మాత్రమే తాను సీఎంగా ఉంటానని..మళ్లీ ఆప్ గెలిస్తే కేజ్రీవాల్ సీఎం బాధ్యతలు చేపడతారని అతిషి సృష్టం చేశారు. కేజ్రీవాల్ నాయకత్వంలోనే తామంతా పనిచేస్తామని తెలిపారు. తాను ఆప్ కాకుండా వేరొక పార్టీలో ఉండి ఉంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా తనకు టిక్కెట్ ఇచ్చేవారు కాదని..కేజ్రీవాల్ వల్లనే తాను ఈ స్థాయిలో ఉన్నానని ఆమె తెలిపారు.
కాగా, అతిశీ పూర్తి పేరు.. అతిశీ మర్లేనా సింగ్. ఆమె వయస్సు 43 ఏళ్లు. ఢిల్లీ యూనివర్సిటీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి డిగ్రీ పొందిన అతిషి ఆ తర్వా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. తొలుత ఢిల్లీ ప్రభుత్వ విద్యాశాఖ సలహాదారుగా ఎదిగిన ఆమె 2020 ఎన్నికల్లో విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ రాజీనామా చేసిన తర్వాత 2023 మార్చిలో అతిషి కేబినెట్ మంత్రిని చేశారు కేజ్రీవాల్. ప్రస్తుత ప్రభుత్వంలో అతిషి మొత్తం 14 మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్నారు. ఇన్ని శాఖల బాధ్యత కలిగిన ఏకైక మంత్రి అతిషి కావడం విశేషం.2013లో ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటులో, పార్టీ విధానాలను నిర్ణయించడంలో అతిషి మొదటిసారి ఇన్వాల్వ్ అయ్యారు. అప్పటినుంచి ఆప్ తో ఆమె బంధం కొనసాగింది.
2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ మేనిఫెస్టో ముసాయిదా కమిటీలో ఆమె ముఖ్యమైన సభ్యురాలు. అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధిగా సమస్యలను వివరించే బాధ్యతను అతిషి స్వీకరించారు. అతిషి అప్పటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సలహాదారుగా కూడా పనిచేశారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆప్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అతిషి..2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి చట్టసభలోకి అడుగుపట్టారు. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధాన విద్యా సంస్కరణలకు నాయకత్వం వహించిన ఘనత కూడా అతిషికే దక్కుతుంది. ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సలహాదారుగా, పాఠశాల మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడంలో, బోధనా ప్రమాణాలను మెరుగుపరచడంలో, హ్యాపీనెస్ కరిక్యులమ్,ఎంటర్ప్రెన్యూర్షిప్ మైండ్సెట్ కరిక్యులమ్ వంటి వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెట్టడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.
టీచర్ నుంచి ఢిల్లీ సీఎంగా- ఆప్ ఫైర్ బ్రాండ్ ఆతిశీ మార్లీనా
అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఆప్ ఫైర్బ్రాండ్ ఆతిశీ మార్లీనా ఢిల్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టనున్నారు. అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోదియా జైలులో ఉన్న సమయంలో పార్టీలో కీలకంగా పనిచేశారు. కేజ్రీవాల్కు వారసురాలిగా ఆతిశీనే తిరుగులేని ఛాయిస్ కావడానికి చాలా కారణాలున్నాయి. ఆతిశీ మార్లీనా సింగ్ పేరు రాజకీయ వర్గాల్లో ఇటీవల ప్రముఖంగా వినిపిస్తోంది. అంతకుముందు, టీచర్, సామాజిక కార్యకర్త, ఎంపీగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆతిశీ మార్లీనా సింగ్, 1981 జూన్ 8న జన్మించారు. ఆతిశీ తల్లిదండ్రులు విజయ్ సింగ్, త్రిప్తా వాహి దిల్లీ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లు. మార్క్స్, లెనిన్ కలయికతో ఆమెకు ఆతిశీ మార్లీనా అని పేరు పెట్టారు. ఆతిశీ కొంతకాలం ఆంధ్రప్రదేశ్లోని రిశి వ్యాలీ స్కూల్లో చరిత్ర, ఇంగ్లీష్ టీచర్గా పనిచేశారు.