ఆర్జేడీ నుంచి తేజ్ప్రతాప్ యాదవ్ బహిష్కరణ
ఆర్జేడీ నుంచి తేజ్ప్రతాప్ యాదవ్ బహిష్కరణకు గురయ్యారు. పెద్దకుమారుడు తేజ్ప్రతాప్ను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించారు అధినేత లాలూప్రసాద్ యాదవ్. పార్టీతో పాటు కుటుంబం నుంచీ బహిష్కరించినట్లు ఎక్స్లో లాలూ పోస్ట్ చేశారు. ప్రవర్తన, బాధ్యతారహిత వైఖరి వల్లే తొలగించానని తెలిపారు. తేజ్ప్రతాప్ ప్రవర్తన తమ కుటుంబ సంప్రదాయాలకు సరిపోలడం లేదని పేర్కొన్నారు. ఇకపై తేజ్ప్రతాప్కు పార్టీలో, కుటుంబంలో ఎలాంటి పాత్ర ఉండదని స్పష్టం చేశారు.
“వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలను విస్మరించడం వల్ల సామాజిక న్యాయం కోసం మన సమష్టి పోరాటాన్ని బలహీనపరుస్తుంది. పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ కార్యకలాపాలు, ప్రవర్తన మా కుటుంబ విలువలు, సంప్రదాయాలకు అనుగుణంగా లేవు. అందువల్ల పార్టీ, కుటుంబం నుంచి తొలగిస్తున్నాను. ఇక నుంచి తేజ్ ప్రతాప్కు పార్టీ, కుటుంబంలో ఎలాంటి పాత్ర ఉండదు. 6 సంవత్సరాలపాటు బహిష్కరిస్తున్న. అతడితో సంబంధాలు కలిగి ఉన్న వారందరూ వారి సొంత నిర్ణయాలు తీసుకోవాలి” అంటూ పోస్ట్ చేశారు లాలూ ప్రసాద్ యాదవ్.
తేజ్ ప్రతాప్ను బహిష్కరించిన విషయంపై లాలూ మరో కుమారుడు తేజస్వీ యాదవ్ స్పందించారు. “మేం ఇలాంటి వాటిని సహించలేం. బిహార్ ప్రజలకు అంకితభావంతో ఉన్నాం. నా అన్నయ్య గురించి అయితే, రాజకీయ జీవితం- వ్యక్తిగత జీవితం భిన్నంగా ఉంటాయి. ఆయనకు తన వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంది. ఆయన పెద్దవాడు. నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛగలవాడు. ఆ విషయంపై మా పార్టీ అధినేత లాలూ ఇప్పటికే స్పష్టం చేశారు. ఆయన నిర్ణయాలను ప్రశ్నించం” అని తేజస్వీ తెలిపారు.
అసలేం జరిగిందంటే?
తేజ్ ప్రతాప్ యాదవ్ ఫేస్బుక్లో శనివారం ఒక పోస్ట్ ప్రత్యక్షమైంది. ఆయన ఓ మహిళతో ఉన్న ఫొటో ఉంది. ఆమె పేరు అనుష్క యాదవ్ అని, గత 12 ఏళ్లుగా తాము రిలేషన్లో ఉన్నట్లు రాసి ఉండగా, ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆయన స్పందించారు. తన సోషల్ మీడియా అకౌంట్స్ను ఎవరో హ్యాక్ చేశారని తెలిపారు. తన కుటుంబ గౌరవాన్ని దెబ్బతీసేందుకే ఎవరో ఇలాంటి పోస్టు చేశారని ఆరోపించారు. ఆ ఫొటో ఎడిట్ చేసిందని, ఇలాంటి పుకార్లను నమ్మవద్దని తన అభిమానులను కోరారు. కానీ ఆ పోస్ట్ తర్వాత ఆయనను పార్టీతో కుటుంబం నుంచి బహిష్కరిస్తున్నట్లు లాలూ ప్రసాద్ యాదవ్ నిర్ణయం తీసుకున్నారు.