రేపటి కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వివిధ శాఖలు పలు అంశాలపై నివేదికలు సిద్ధం చేస్తున్నాయి. ఏపీ, తెలంగాణ విభజన వివాదాలపై మంత్రివర్గం చర్చించనుంది. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ధాన్యం పెంపు మార్గాలపై సమావేశంలో చర్చ జరగనుంది. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలపై ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదికపై చర్చించి, మరమ్మతులు, తదుపరి కార్యచరణలపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కొత్త విద్యా సంవత్సరం సన్నాహాలపై కూడా మంత్రివర్గంలో చర్చ జరగనుంది. శనివారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగి పదేళ్లు పూర్తి కానున్నందున, పునర్విభజనకు సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించనున్నారు. పునర్విభజన చట్టంలోని షెడ్యూలు 9, 10లోని వందకుపైగా ఆస్తుల విభజన, హైదరాబాద్లో ఏపీకి కేటాయించిన భవనాల స్వాధీనం, బకాయిల వివాదాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వీటికి సంబంధించిన వివరాలతో నివేదిక తయారు చేస్తున్న ఆర్థిక శాఖ రేపు కేబినెట్ ముందు పెట్టనుంది. ఏపీతో చర్చించేందుకు కమిటీ ఏర్పాటు చేసి కొన్ని అంశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
రైతు రుణమాఫీపై కూడా మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇటీవల ఎన్నికల సందర్భంలో ప్రజలకు హామీ ఇచ్చినందున, ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేసి తీరాల్సిందేనని సీఎం చెబుతున్న నేపథ్యంలో దానికోసం నిధుల సమీకరణ, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు వంటి అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. సుమారు 42 లక్షల మంది రైతులకు రుణమాఫీకి సుమారు రూ.32,000 కోట్ల నిధులను ఎలా సమకూర్చుకోవాలనే అంశంతో పాటు విధివిధానాలపై అధికారులకు మంత్రివర్గం దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ధాన్యం సేకరణ వేగం పెంచడానికి అవసరమైన ప్రణాళిక, అకాల వర్షాలతో తడిసిన ధాన్యం వంటివి చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. రానున్న ఖరీఫ్ పంటల ప్రణాళికపై కూడా కేబినెట్లో చర్చ జరగనుంది. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రైతులకు అవగాహన కార్యక్రమాలపై చర్చించే అవకాశం ఉంది.
మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలపై జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ సమర్పించిన మధ్యంతర నివేదికలపై చర్చించి మరమ్మతులపై ఏం చేయాలో నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి సన్నాహాలపై కూడా కేబినెట్ చర్చించనుంది. విద్యార్థుల నమోదు, పాఠ్యపుస్తకాలు, యునిఫాంల పంపిణీ, విద్యా సంస్థల్లో వసతులపై చర్చించనున్నారు. పాఠశాల, కళాశాల, ఉన్నత విద్యా శాఖలు, ఇంటర్ బోర్డు వివిధ అంశాలపై నివేదికలు సిద్ధం చేశాయి.