Monday, May 5, 2025

ఓటు హక్కును వినియోగించుకున్న సిఎం రేవంత్, మంత్రులు

పార్లమెంట్ ఎన్నికల్లో సిఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు సోమవారం తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలల్లో సిఎం రేవంత్ రెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకోగా, ఖమ్మం జిల్లా మధిరలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుటుంబసభ్యులతో కలిసి ఓటేశారు. ఖమ్మం గొల్లగూడెంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కల్లూరు మండలం నారాయణపురంలో మంత్రి పొంగులేటి, ములుగు జిల్లా జగ్గన్నపేటలో మంత్రి సీతక్క, సంగారెడ్డి జోగిపేటలో మంత్రి దామోదర రాజనర్సింహ, వంచనగిరిలో మంత్రి కొండా సురేఖ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటు విలువ అత్యంత పవిత్రమయ్యింది: డిప్యూటీ సిఎం
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ కేంద్రమైన సుందరయ్య నగర్ పోలింగ్ బూత్‌లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఆయన సతీమణి నందిని, కుమారుడితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువ అత్యంత పవిత్రమయ్యిందని, మంచి నాయకులను ఎన్నుకొని ఓటు విలువకు సార్ధకత చేకూర్చాలని ఆయన పిలుపునిచ్చారు.

ఓటర్లతో మంత్రి శ్రీధర్‌బాబు ముచ్చట్లు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 151 బూత్ లో మంత్రి శ్రీధర్ బాబు ఓటు వేశారు. అందరితోపాటు సాదాసీదాగా వరుస క్రమంలో నిల్చుని అందర్నీ పలకరిస్తూ తన ఓటును వినియోగించుకున్నారు. అంతకుముందు మంథని పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల, బాలుర ప్రభుత్వ పాఠశాల పరిసరాల్లో ఎన్నికల సందర్భంగా ఓటర్లతో కలిసి సరదాగా ముచ్చటించారు.

బస్సులో వెళ్లి ఓటు వేసిన పొన్నం
ఎన్నికల కమిషన్ చెప్పినట్టుగా భారత పౌరుడిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి తన ఓటు హక్కును వినియోగించుకున్నానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో కుటుంబసమేతంగా ఆర్టీసి బస్సులో పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలంటే మతతత్వానికో, ప్రాంతీయ తత్వానికో, కుల తత్వానికో, ప్రలోభాలకో లొంగకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించు కోవాలన్నారు. ప్రతి పౌరుడు ఎన్ని పనులు ఉన్నా బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రజాస్వామ్య దేశంలో ఓటు వజ్రాయుధం: మంత్రి ఉత్తమ్
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని దేశంలో ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 182వ పోలింగ్ బూత్‌లో ఆయన సతీమణి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ శాతం పెరిగేలా ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు వజ్రాయుధం అన్నారు.

ఓటు అంటే ప్రశ్నించే ధిక్కార స్వరం: మంత్రి కోమటిరెడ్డి
నల్గొండ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం పెంచేందుకు ప్రజలంతా ఓటింగ్‌లో పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు. ఓటు అంటే ప్రశ్నించే ధిక్కార స్వరమని, అది ఉపయోగించుకున్నప్పుడే ప్రశ్నించే హక్కు ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఓటు వేస్తే మంచి ప్రజాప్రతినిధిని ఎన్నుకోవడానికి అది దోహదపడుతుందన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com