Monday, June 2, 2025

అసెంబ్లీలో జీఎస్టీ స్కాం

  • అసెంబ్లీలో జీఎస్టీ స్కాం
  • చర్చకు సర్కారు నిర్ణయం
  • ఇప్పటికే మాజీ సీఎస్​తో సహా ఐదుగురిపై కేసు

కమర్షియల్ ట్యాక్స్ స్కాంలో రూ. 1400 కోట్ల మాయంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్​గా తీసుకుంటున్నది. ఈ అంశాన్ని అసెంబ్లీలో చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కుంభకోణంలో ఇప్పటికే ఐదు మందిపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ వ్యవహారంపై సీసీఎస్ పోలీసులు ఇప్పటికే ఆధారాలను సేకరించారు. 75 మంది పన్నులు చెల్లింపుదారులు కార్యకలాపాల వివరాలను నిందితులు ఉద్దేశపూర్వకంగా ఆన్‌లైన్‌లో కనిపించకుండా చేసినట్లు తెలుస్తోంది. పన్ను ఎగవేతకు నిందితులు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ స్కాంలో కమర్షియల్ ట్యాక్స్ , ఐఐటీ హైదరాబాద్ మధ్య జరిగే లావాదేవీలను కూడా పక్కదారి పట్టినట్లు గుర్తించారు. హైదరాబాద్ ఐఐటీ సాఫ్ట్‌వేర్‌లోని సమాచారాన్ని స్పెషల్ ఇనిషియేటివ్ వాట్సప్ గ్రూప్‌కు చేరేలా ఆదేశాలు జారీ అయ్యాయని.. ఆ గ్రూప్‌లో మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ కూడా ఉన్నట్లు గుర్తించారు. తెలంగాణా బేవరెజస్ కార్పొరేషన్ పన్ను ఎగవేత ద్వారా కమర్షియల్ ట్యాక్స్‌కు వేయి కోట్లు నష్టం వాటిన్నట్లు సమాచారం. మరో 11 ప్రైవేటు సంస్థలు రూ.400 కోట్ల వరకు పన్నులు ఎగవేసినట్లు గుర్తించారు. ఈ కేసులో మరికొంత మందికి సీసీఎస్ పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. అసెంబ్లీలో చర్చ తర్వాత అరెస్ట్‌లు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

కమర్షియల్ ట్యాక్స్‌ స్కామ్‌పై సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ స్కామ్‌కు సంబంధించి మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ -5 నిందితుడిగా సోమేశ్ కుమార్ పేరు చేర్చారు. మాజీ సీఎస్‌‌తో పాటు వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ విశ్వేశ్వర్ రావు, డిప్యూటీ కమిషనర్‌ ఎ.శివరామ ప్రసాద్‌, అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబుపై కేసు నమోదు అయ్యింది. సీసీఎస్‌లో కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ రవి కనూరి ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ అయ్యింది.

నకిలీ ఇన్వాయిస్​లు

ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌లో చెల్లింపుల్లో రూ.1000 కోట్లు స్కామ్ జరిగినట్లుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. నకిలీ ఇన్వాయిస్​లు సృష్టించి మోసాలకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. దాదాపు 75 కంపెనీలు అవకతవకలకు పాల్పడినట్టు గుర్తించారు. లబ్ది పొందిన కంపెనీల జాబితాలో రాష్ట్ర బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఫోరెన్సిక్‌ అడిట్‌లో ఈ వ్యవహారం వెలుగు చూసింది. మాజీ సీఎస్‌ సోమేష్ సూచనలతోనే సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. స్కామ్‌ పాల్పడ్డ నిందితులపై ఐపీసీ 406,409,120B ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు అయ్యింది. త్వరలో అధికారులకు పోలీసులు నోటీసులు ఇచ్చి విచారించనున్నారు.

అక్రమాలకు ‘స్పెషల్‌ ఇనిషియేటివ్స్‌’ వాట్సాప్‌ గ్రూప్‌

వాణిజ్యపన్నుల శాఖకు సంబంధించి తామెలాంటి సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయలేదని ప్లియాంటో టెక్నాలజీస్ సంస్థ వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తమ శాఖకు, ఐఐటీ హైదరాబాద్‌తో జరిగిన ఒప్పందం గురించి మరింతలోతుగా వివరాలు రాబట్టేందుకు జనవరి 25న స్టేట్ ఆడిట్ డిపార్ట్​మెంట్ డైరెక్టర్‌కు వాణిజ్యపన్నులశాఖ ఉన్నతాధికారులు లేఖ రాశారు. పలు లోపాలున్నట్లు ఆడిట్ డిపార్ట్​మెంట్ నివేదిక ఇచ్చింది. డేటా అంతా ఐఐటీ హైదరాబాద్ నియంత్రణలోనే ఉందని, డేటాలో అవసరమైనప్పుడు మార్పులు చేసేందుకు అవకాశముందని వెల్లడించింది. మరోవైపు ఐఐటీ హైదరాబాద్ నిర్వహణలో ఉన్న డేటాబేస్, ఆడిట్ అప్లికేషన్ల గురించి సీడాక్ నుంచి సైతం వాణిజ్యపన్నుల శాఖ నివేదిక తెప్పించింది. ఈ నేపథ్యంలో సీడాక్, ఐఐటీ హైదరాబాద్, వాణిజ్యపన్నుల శాఖ ఉన్నతాధికారుల మధ్య జనవరి 30న ఒక సమావేశం జరిగింది. ‘స్పెషల్ ఇనిషియేటివ్స్’ పేరిట ఏర్పాటైన వాట్సప్ గ్రూప్ నుంచి ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేటర్ ప్రొఫెసర్‌ శోభన్‌బాబుకు తరచూ ఆదేశాలు వచ్చేవని ఆ సమావేశంలో వెల్లడైంది. ఆ గ్రూప్‌లో సోమేశ్‌కుమార్, కాశీ విశ్వేశ్వరరావు, శివరామప్రసాద్ సభ్యులుగా ఉన్నట్లు తేలింది. వాట్సప్ గ్రూప్ ఏర్పాటుపై వాణిజ్యపన్నులశాఖ కాశీవిశ్వేశ్వరరావు, శివరామప్రసాద్‌ల వివరణ కోరింది. సోమేశ్‌ కుమార్ పర్యవేక్షణలోనే ఏర్పాటైన ఆ గ్రూపును 2022 డిసెంబరులో నిలిపివేశామని వారిద్దరు సమాధానమిచ్చారు.

పన్ను ఎగవేతకు సహకరించేందుకే

ఫొటోలు, వీడియోలు లేకుండా వాట్సప్ చాట్ హిస్టరీలనూ వారు సమర్పించారు. అయితే 2024 ఫిబ్రవరి వరకు ఆ వాట్సప్ గ్రూపులో కార్యకలాపాలు నడిచాయని తేలడంతో ఫొటోలు, వీడియోలతో కూడిన చాట్ హిస్టరీని సమర్పించాలని వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు వారిద్దరికి అత్యవసర మెమో జారీచేశారు. వారు సమర్పించిన హిస్టరీలో పలు అంశాలు గుర్తించారు. ఐజీఎస్టీ నష్టాలకు సంబంధించిన పలు నివేదికలను వాటిలో గుర్తించారు. అలాగే జీఎస్టీ చెల్లింపుల్లో అక్రమాల కేసుల్లోనూ రిజిస్ట్రేషన్లను రద్దు చేయొద్దనే ఆదేశాలున్నట్లు తేలింది. వారిద్దరి సెల్‌ఫోన్లను ఉన్నతాధికారులు జప్తు చేశారు. వారిద్దరు హైకోర్టును ఆశ్రయించగా వారి పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.

మరోవైపు ఫోరెన్సిక్ ఆడిట్ సక్రమంగా జరిగేలా చూసేందుకు ప్రాజెక్టు ఇన్వెస్టిగేటర్‌ను మార్చాలని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్‌కు వాణిజ్య పన్నుల శాఖ లేఖ రాసింది. అప్పటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎప్పటికప్పుడు ఇచ్చిన సూచనల మేరకే తాము నడుచుకున్నామని పేర్కొంటూ అందుకు సంబంధించిన కొన్ని ప్రతుల్ని వాణిజ్యపన్నులశాఖకు ఐఐటీ హైదరాబాద్ పంపించింది. ఎస్జీఎస్టీ, సీజీఎస్టీలకు సంబంధించిన డ్రాఫ్ట్ నోటీసుల గురించి మాత్రమే ఆ ప్రతుల్లో ఉన్నట్లు తేలింది. కాశీవిశ్వేశ్వరరావు చెప్పినట్లు ఐజీఎస్టీకి సంబంధించి లేకపోవడం గమనార్హం. ఫోరెన్సిక్ ఆడిట్‌కు సంబంధించి సీడాక్ తుది నివేదిక ప్రకారం 75 మంది పన్ను చెల్లింపుదారులకు సంబంధించిన కార్యకలాపాలను ఉద్దేశపూర్వకంగా ఆన్‌లైన్‌లో కనిపించకుండా చేసినట్లు గుర్తించారు. పన్ను ఎగవేతకు సహకరించేందుకే ఇలా చేసినట్లు తేలింది.

ప్ర‌దాన వార్త‌లు

సొంత పార్టీ వాళ్లే ఎంపీగా ఓడించారన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com