ఏపీ ఉద్యోగుల బదిలీ ప్రచారంపై తెలంగాణ సర్కార్ క్లారిటీ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కొత్త నిర్ణయాలేమీ తీసుకోలేదని రేవంత్ రెడ్డి సర్కార్ స్పష్టం చేసింది. రాష్ట్రం ఏర్పడిన ఏడాది రెండేండ్లలోనే ఉద్యోగుల పంపిణీ ప్రక్రియ దాదాపుగా కొలిక్కి వచ్చిందని పేర్కొంది. తాజాగా ఏపీ నుంచి ఉద్యోగులు తెలంగాణకు వస్తున్నట్లు జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను అప్రమత్తం చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఉద్యోగుల విభజనకు సంబందించి ఆప్షన్లు, పోస్టుల లభ్యత ఆధారంగా తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులు కొందరు ఏపీకి, ఏపీ స్థానికత ఉన్న ఉద్యోగులు కొందరు తెలంగాణకు పంపిణీ అయ్యారని ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.
వైద్య అవసరాలు, భార్యభర్తలు ఉద్యోగాల్లో ఉండటం, పిల్లల చదువులు, సొంత ఇల్లు ఉన్నాయనే కారణాలతో కొందరు ఉద్యోగులు ఈ పంపిణీ జరిగిన తీరుతో ఇబ్బందులు పడ్డారని తెలిపింది. మానవీయ కోణంలో తమ బాధను అర్థం చేసుకోవాలని పలుమార్లు ప్రభుత్వాన్ని అభ్యర్థించడం, అదే సమయంలో ఏపీకి వెళ్లేందుకు మాకు అవకాశం ఇవ్వాలని కోరుతూ తెలంగాణకు పంపిణీ అయిన 1369 మంది ఉద్యోగులు తమతంట తాముగా సమ్మతి తెలిపారని పేర్కొంది. వివిధ విభాగాల్లో పని చేస్తున్న 1369 మంది శాశ్వతంగా ఏపీకి వెళ్లేందుకు సమ్మతిస్తూ తమను ఏపీకి పంపించాలని అభ్యర్థనను అందించారని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.
2021 సెప్టెంబర్లో తెలంగాణ ప్రభుత్వం ఆయా ఉద్యోగుల వివరాలను సేకరించి.. వీరి అభ్యర్థన మేరకు ఏపీకి పంపించేందుకు మాకెలాంటి అభ్యంతరం లేదని నో ఆబ్జక్షన్ తెలియజేస్తూ 2021 సెప్టెంబర్లో తెలంగాణ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసిందని తెలిపింది. ఇదే తరహాలో ఏపీ ప్రభుత్వం కూడా అక్కడి నుంచి తెలంగాణకు వచ్చేందుకు సిద్ధపడిన ఉద్యోగుల వివరాలు తెలంగాణ సర్కార్ సేకరించగా… అక్కడి నుంచి 1808 మంది ఉద్యోగులు తెలంగాణకు రావడానికి ఆప్షన్లు ఇచ్చారు. శాశ్వతంగా తెలంగాణకు వెళ్లేందుకు సమ్మతి తెలిపే ఉద్యోగుల జాబితాను తయారు చేసింది. 2022 సెప్టెంబర్ 23వ తేదీన అప్పటి ఏపీ సీఎస్ సమీర్ శర్మ అప్పుడు తెలంగాణ సీఎస్ గా ఉన్న సోమేష్ కుమార్కు ఇదే విషయంపై లేఖ రాశారు.
ఉద్యోగుల అభ్యర్థనలను మానవీయ కోణంలో పరిశీలించాలని కోరారు. రెండు రాష్ట్రాల్లో అప్పటికే ఆఫ్షన్లు ఇచ్చిన ఉద్యోగుల పరస్పర బదిలీకి ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ ఉద్యోగుల బదిలీ వ్యవహారం ఎనిమిదేండ్లుగా నానుతున్న వ్యవహారం. విభజన చట్టంలోని అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య సమావేశాలు జరిగినప్పుడల్లా ఈ అంశంపై పలుమార్లు చర్చలు జరిగాయి. కానీ ఇప్పటివరకు ఉద్యోగుల పరస్పర బదిలీకి సంబంధించి రెండు ప్రభుత్వాలు కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదేండ్లు పూర్తి కావటంతో విభజన చట్టంలోని అంశాలు… రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న అంశాలన్నింటినీ తెలంగాణ ప్రభుత్వం ఆరా తీసింది. ఇంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఈ యేడాది జూన్ 2 వ తేదీ నుంచి తెలంగాణకు ప్రత్యేక రాజధానిగా ఏర్పడింది.
ఇదే సందర్భంగా ఏపీకి కేటాయించిన ఆఫీసులు, భవనాలతో పాటు విభాగాల వారీగా విభజన చట్టంలోని అన్ని అంశాలపై ప్రత్యేక నివేదిక ఇవ్వాలని ఆర్థిక శాఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్లో ఉన్న అంశాలపై తదుపరి చర్చలు, సమావేశాలేవీ జరగలేదు. ఇటువంటి సమయంలో ఏపీ నుంచి ఉద్యోగులు తెలంగాణకు వస్తున్నట్లు జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని రాష్ట్రం ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను అప్రమత్తం చేసింది.