తెలంగాణ దేవాదాయ శాఖకు ఇతర రాష్ట్రాల్లో భారీగా భూములు ఉన్నట్లు రేవంత్ రెడ్డి సర్కార్ గుర్తించింది. ఎండోమెంట్కు మెుత్తం 91 వేల ఎకరాల భూములు ఉండగా.. అందులో దాదాపు 6 వేల ఎకరాలు నాలుగు రాష్ట్రాల్లో ఉన్నట్లు గుర్తించారు. ఆయా భూములకు సరైన హద్దులు, సర్వే నంబర్లు లేక స్వాధీనానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని దేవాదాయ శాఖ నివేదిక ఇచ్చింది. ఆ భూముల స్వాధీనానికి ఎలా ముందుకెళ్లాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. ఆయా రాష్ట్రాల సీఎంలు, ఉన్నతాధికారులకు ప్రభుత్వం తరపున లేఖ పంపాలని నిర్ణయించారు. అయితే, ఆ భూములు ఉన్నాయా.. కబ్జాకు గురయ్యాయా.. అనేది ముందుగా తేల్చనున్నారు. దీనికోసం దేవాదాయ, రెవెన్యూ శాఖ నుంచి స్పెషల్ టీంను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్తో పాటు ఏపీలో తెలంగాణ ఆలయాల భూములున్నాయి.
అసలేమిటి..?
తెలంగాణ దేవాదాయ భూములపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. రెండు రోజుల క్రితం సీఎం చేసిన సమీక్షా సమావేశంలో ఆలయాల భూములపై వివరాలు తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ ఎండోమెంట్ భూములు భారీగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రంలో వివిధ ఆలయాల పరిధిలో మొత్తం 91,827 ఎకరాల భూమి ఉన్నట్లు ఎండోమెంట్ అధికారులు నివేదిక ఇచ్చారు. అందులో 25 వేల ఎకరాలు కబ్జాకు గురైనట్లు గుర్తించగా.. మరో 6 వేల ఎకరాలు ఇతర రాష్ట్రాల పరిధిలో ఉన్నట్లు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రమైన ఏపీతో పాటుగా.. మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల పరిధిలో 6 వేల ఎకరాలు ఉన్నట్లు ఎండోమెంట్ రికార్డుల్లో ఉంది.
మఠాలకు 3 వేల ఎకరాలు
ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఈ 6 వేల ఎకరాల్లోనూ 3 వేల ఎకరాలకు పైగా భూములు మఠాలకు సంబంధించినవని ఎండోమెంట్ అధికారులు గుర్తించారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయానికి 1,052.07 ఎకరాల భూమి ఉంది. ఈ భూములు ఏపీలోని గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఉన్నట్లు రికార్డులున్నాయి. జనగామ జిల్లా లింగాల ఘన్పూర్లోని రామచంద్రస్వామి ఆలయానికి 12.19 ఎకరాల భూమి ఉండగా.. అది ఏపీలోని గుంటూరు జిల్లా వట్టి చెరుకు మండలం కొర్నెపాడు గ్రామంలో ఉన్నట్లు ఎండోమెంట్ నివేదికల్లో తేలింది. వరంగల్ పరిధిలోని రంగశాయిపేట సీతారామచంద్రస్వామి ఆలయానికి 8 ఎకరాల భూమి ఉండగా.. ఆ భూమి ఏపీలోని కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో ఉన్నట్లు తేలింది. మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ బాల బ్రహ్మేశ్వరస్వామి అన్నదాన సత్రానికి 20.17 ఎకరాలు ఉండగా.. ఆ భూములు ఏపీలోని కర్నూల్ జిల్లా జి.సింగవరం పరిధి కల్లూరు గ్రామంలో ఉన్నట్లు రికార్డుల్లో ఉన్నాయి.
నారాయణపేట జిల్లా నేరేడ్గం మండలం మగనూరులోని సిద్ధిలింగేశ్వరస్వామి ఆలయానికి 1,137 ఎకరాల దేవాదాయ భూమి ఉండగా.. ఆ భూమి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నట్టు గుర్తించారు. ఆదిలాబాద్ శ్రీరామచంద్ర గోపాల కృష్ణమఠ్కు మెుత్తం 1,280.38 ఎకరాల భూమి ఉండగా.. అది మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లా ఖేలాపూర్ తాలుకా గోష్మి గ్రామంలో ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. హైదరాబాద్ ఆసిఫ్ నగర్ మల్లేపల్లిలోగల సీతారాంభాగ్ సీతారామచంద్రస్వామి ఆలయానికి 2,492.17 ఎకరాల దేవాదాయ భూమి ఉండగా.. అది కూడా మహారాష్ట్రలోని అమరావతి, రాజస్థాన్ రాష్ట్రం పుష్కర్లో ఉన్నట్టు రికార్డుల్లో గుర్తించారు. ఈ 4 రాష్ట్రాల్లో తెలంగాణ ఎండోమెంట్కు 6.18 వేల ఎకరాల భూమి ఉండగా.. ఒక్క మహారాష్ట్రలోనే 3,709.55 ఎకరాలు ఉంది. ఆ తర్వాత కర్ణాటకలో 1,137 ఎకరాలు, ఏపీలో 1,092.43 ఎకరాల భూమి ఉన్నట్లు తేలింది.
హద్దుల్లేవ్.. !
ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఈ భూములకు సరైన సరిహద్దులు, నక్ష వంటివి లేవు. దీంతో చాలా వరకు అన్యాక్రాంతం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ భూములను ఎలా స్వాధీనం చేసుకోవాలనే దానిపై ప్రభుత్వం సందిగ్ధంలో పడింది. ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉంది. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. తాజా పరిస్థితుల్లో ఈ భూముల స్వాధీనానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆలయాల రికార్డులన్నీ ఆయా రాష్ట్రాలకు పంపించాలని నిర్ణయించారు.
అమ్మేద్దాం..
ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ ఆలయాల భూములను అక్కడే అమ్మకానికి పెట్టాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. ఇతర రాష్ట్రాల పరిధిలోని భూములు అమ్మి.. అంతే స్థాయిలో భూమిని స్థానికంగా ఎండోమెంట్కు ఇవ్వాలని ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. అందుకు ముందుగా అక్కడి భూములు అసలున్నాయా.. ఉంటే వాటి ధరలు ఎలా ఉన్నాయనే పూర్తి నివేదిక కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. అక్కడి భూముల స్థితిగతులను బట్టి ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవటమా..? లేక అమ్మకానికి పెట్టి వచ్చిన ఆదాయంతో తెలంగాణలోని ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలనే దానిపై సీఎం నిర్ణయం తీసుకోనున్నారు.