ఘనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి
ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఒసాకో ఎక్స్పో
జపాన్లోని ఒసాకాలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఒసాకా ఎక్స్పోలో తెలంగాణ రాష్ట్రం తన ప్రత్యేకమైన పెవిలియన్ను ఘనంగా ప్రారంభించింది. కిటాక్యూషు నుంచి ఒసాకా చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సోమవారం ఉదయం భారత పెవిలియన్లో అడుగుపెట్టింది. భారత పెవిలియన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ జోన్ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు ప్రారంభించారు.
ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఒసాకో ఎక్స్పో నిర్వహిస్తారు. ఒసాకో ఎక్స్పోలో పాల్గొన్న మన దేశంలోని తొలి రాష్ట్రం తెలంగాణ కావటం విశేషం. ఒసాకా ఎక్స్పో వేదికపై తెలంగాణ తన వైవిధ్యమైన సంస్కృతి, అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక అనుకూల వాతావరణం, సాంప్రదాయ కళలు, పర్యాటక ఆకర్షణలను ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే సందర్శకులకు చాటి చెప్పనుంది.
తెలంగాణ పెవిలియన్లో రాష్ట్ర సాంకేతిక పురోగతి, సాంస్కృతిక వారసత్వం, పర్యాటక సంపదను ప్రతిబింబించే ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ వేదిక ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, సాంస్కృతిక సహకారాన్ని పెంపొందించే దిశగా తెలంగాణ అడుగులు వేస్తోంది. ఈ వేదికపై రాష్ట్ర ప్రత్యేకతలు, పారిశ్రామిక అనుకూలతలు, పర్యటక ఆకర్షణలు చాటి చెప్పేలా ఏర్పాట్లు చేశారు. పెట్టుబడులపై వివిధ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకునే అవకాశముంది. సీఎం రేవంత్రెడ్డి మంగళవారం ఒసాకా నుంచి హిరోషిమా వెళ్లనున్నారు.