Friday, September 20, 2024

2035 నాటికి 40 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యం

* 2035 నాటికి 40 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యం
* గ్రీన్ పవర్ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు సమగ్ర ఇంధన విధానం
* తెలంగాణ సోలార్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి  పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలను హైదరాబాద్‌కు ఆహ్వానిస్తున్నాం
* ప్రపంచ 4వ పునరుత్పాదక విద్యుత్తు పెట్టుబడిదారుల సమ్మేళనంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
తెలంగాణ రాష్ట్రం  2035 నాటికి 40,000 మెగావాట్ల గ్రీన్ పవర్ ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంతో ముందుకు వెళుతుందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి  విక్రమార్క మల్లు అన్నారు. గుజరాత్ రాష్ట్రం గాంధీ నగర్ లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లో సోమవారం ప్రధానమంత్రి మోడీ అధ్యక్షతన ప్రారంభమైన నాలుగవ ప్రపంచ గ్రీన్ పవర్ పెట్టుబడిదారుల సమ్మేళనం, ఎగ్జిబిషన్ సందర్భంగా ఏర్పాటైన సభలో డిప్యూటీ సీఎం ప్రసంగించారు. రాష్ట్రంలో గ్రీన్ పవర్ ఉత్పత్తికి ఉన్న మార్గాలు, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఆయన ఈ సందర్భంగా వివరించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న నేటి ప్రపంచంలో ఆర్థిక, సామాజిక శ్రేయస్సుకు రిలయబుల్ ఎనర్జీ పునాది లాంటిది అని పేర్కొన్నారు. భారత దేశం 500 గిగా వాట్ల గ్రీన్ పవర్ ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. తెలంగాణ డైనమిక్ ఆర్థిక వ్యవస్థ, ఐటీ, ఫార్మసిటికల్స్ తయారీ వంటి అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలతో ఈ పరివర్తనకు తెలంగాణ ప్రభుత్వం నాయకత్వం వహించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. పెరుగుతున్న ఇంధన అవసరాలను సమతుల్యం చేయడం స్థిరత్వానికి ఒక నిబద్దతగా తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సిటీ, ఫోర్త్ సిటీ, మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ను ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు.
గ్రీన్ పవర్ రంగాల్లో కంపెనీల అభివృద్ధికి అవకాశాలు : ఇంటలిజెన్స్ సిటీ, ఫ్యూచర్ సిటీ సుస్థిర సాంకేతికల చుట్టూ అభివృద్ధి కేంద్రీకృతమై ఉంది. కీలక పారిశ్రామిక కారిడార్లను అనుసంధానం చేయడానికి ప్రాంతీయ రింగ్ రోడ్డు, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ను ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు. ఇవి గ్రీన్ పవర్ ఉత్పత్తికి అవకాశం కల్పిస్తాయన్నారు. తెలంగాణలో సమృద్ధిగా ఉన్న వనరులు, నైపుణ్యం కలిగిన కార్మికులు, టిఎస్ ఐపాస్ వంటి వ్యాపార అనుకూల సంస్థలు గ్రీన్ పవర్ రంగాల్లో కంపెనీలు అభివృద్ధి చెందడానికి మంచి అవకాశాలను అందిస్తున్నాయి అన్నారు.  300 రోజులకు పైగా ఉండే సూర్యరశ్మితో సుమారుగా 26.4 గిగావాట్ల  సామర్థ్యం అంచనా వేస్తున్నట్టు తెలిపారు. భారతదేశంలో బలంగా గాలులు వీచే మొదటి ఎనిమిది రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణ ఉందన్నారు. 150 మీటర్ల వద్ద సుమారుగా 54 గిగావాట్ల గాలి సామర్థ్యం కలిగి ఉందన్నారు. రాష్ట్రంలో  శ్రీశైలం, నాగార్జునసాగర్ లలో పంప్ ఆపరేషన్లతో రాష్ట్రంలో రెండు ప్రధాన హైడ్రో ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక్కడ పియుఎంపియు స్టోరేజ్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపట్టడానికి ఇంకా అవకాశాలు ఉన్నాయని తెలిపారు. వీటితోపాటు రిజర్వాయర్లు, పాడుబడిన గనులు మొదలైన వాటిని ఉపయోగించి నది మరియు నది వెలుపల పంపుడ్ స్టోరేజీ ప్రాజెక్టులను చేపట్టడానికి మరింత అవకాశం ఉందని వివరించారు. ఇతర గ్రీన్ పవర్ సంభావ్యతలో హైడ్రోజన్, జియో థర్మల్ ( సుమారు 1500 నుంచి 3,000 మెగావాట్ల) మినీ హైడల్ ( సుమారు 250 మెగావాట్ల) విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందన్నారు.
ప్రోత్సహించడానికి సమగ్ర గ్రీన్ పవర్ ఎనర్జీ పాలసీ : తెలంగాణ రాష్ట్రం స్థిరమైన, విశ్వసనీయమైన గ్రీన్ పవర్ ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి సమగ్ర గ్రీన్ పవర్ ఎనర్జీ పాలసీని అభివృద్ధి చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం చేపట్టిన గ్రీన్ పవర్ మిషన్ లక్ష్యం సాధించడానికి వివిధ రంగాల్లోని పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలు మాతో చేతులు కలపాలని ఆహ్వానిస్తున్నానని తెలిపారు. గ్రీన్ పవర్ తో భవిష్యత్తును బలంగా నిర్మిద్దాం, ఇది కేవలం తెలంగాణ రాష్ట్రం కోసమే కాకుండా దేశం కోసం, యావత్ మానవాళి కోసం కూడా అని తెలిపారు. సోలార్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపే వారంతా హైదరాబాద్ కు రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. సమావేశంలో ప్రధాని మోడీతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్, గోవా, రాజస్థాన్ ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర గ్రీన్ పవర్ మంత్రి, తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్లు ముషారఫ్ ఫరూఖీ, వరుణ్ రెడ్డి, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం : గుజరాత్ రాష్ట్రం గాంధీ నగర్ లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరుగుతున్న ప్రపంచ గ్రీన్ పవర్ పెట్టుబడిదారుల సమావేశం సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సుమారు 40 మంది ఔత్సాహిక  పెట్టుబడిదారులు, కంపెనీల చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు జర్మనీ జిఐజడ్  ప్రతినిధులతో పాటు టాటా పవర్, సెం కార్బ్, వెల్ స్పన్, రెన్యూ పవర్, ఇండియన్ ఆయిల్, ఎన్‌హెచ్‌పీసీ , ఐఐటి బాంబే, ఓఎన్‌వైఎక్స్, హీరో వపర్, ఊర్జా ఎనర్జీ, ఇన్వెస్టర్స్ సమ్మిట్ బ్యాంక్స్, కెజిపిఎం వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు ఆసక్తి కనబరిచారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ కంపెనీలు పెద్ద ఎత్తున ఆసక్తి కనబరచడంతో హైదరాబాదులో ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలని, విద్యుత్ సంస్థల సీఎండీలు ముషారఫ్, వరుణ్ రెడ్డి, రెడ్ కో వీసీఎం వావిళ్ళ అనీల తదితరులను డిప్యూటీ సీఎం ఆదేశించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

Lavanya Tripati New Pics

Ishita Raj Insta Hd Pics

Nabha Natash New photos