తెలుగు హీరోయిన్లను ఉద్దేశించి నిర్మాత ఎస్కేఎన్ (శ్రీనివాస కుమార్ నాయుడు) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తాము తెలుగు రాని హీరోయిన్ లను అభిమానిస్తామని… ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిలను ప్రోత్సహిస్తే ఏమవుతుందో ఈమధ్యనే తమకు అర్థమయిందని ఆయన అన్నారు. ఇక నుంచి తెలుగు అమ్మాయిలను ప్రోత్సహించకూడదని తాను, డైరెక్టర్ సాయిరాజేశ్ నిర్ణయించుకున్నామని చెప్పారు. ‘రిటర్న్ ఆఫ్ డ్రాగన్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు ఎస్కేఎన్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఇలా మాట్లాడారు.
హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పుకుంటున్నారు. వైష్ణవిని ‘బేబీ’ సినిమాతో హీరోయిన్ గా ఎస్కేఎన్ పరిచయం చేశారు. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న వైష్ణవి… ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ, ఆనంద్ దేవరకొండల సినిమాల్లో నటిస్తోంది. తమ బ్యానర్ లో ఆమెకు ఎస్కేఎన్ మరో సినిమాను ఆఫర్ చేస్తే… ఆమె అంగీకరించలేదట. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారనే టాక్ నడుస్తోంది. ఆయన వ్యాఖ్యలను కొందరు నెటిజెన్లు తప్పుబడుతున్నారు. తెలుగు హీరోయిన్లు ఎదుగుతున్న తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అంటున్నారు. ఆయన ఒక హిట్ ఇస్తే తిరిగి మళ్ళీ ఆయన బ్యానర్లో నటించాలా అలాంటి రూల్ ఏదైనా ఉందా అంటూ… నెటిజన్లు ఆగ్రహం చెందుతున్నారు.