తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. ఏపీలో ఐదు, తెలంగాణలో ఐదు.. మొత్తం పది స్థానాలకు నోటిఫికేషన్ ను ఈసీ రిలీజ్ చేసింది. మార్చి10 వరకు నామినేషన్ దాఖలు చేయవచ్చు. 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది, 13న ఉపసంహరణకు గడువు ఉంటుంది. మార్చి 20వ తేదీన ఉదయం 09 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అసెంబ్లీలో పోలింగ్ జరగనుంది, అదే రోజు సాయంత్రం5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
ఏపీ, తెలంగాణలో ఇలా
శాసనసభలో పార్టీలకున్న సంఖ్యా బలాన్ని బట్టి చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 4 ఎమ్మెల్సీ సీట్లు, బీఆర్ఎస్కు ఒక ఎమ్మెల్సీ సీటు దక్కే అవకాశం ఉంది. ఇక ఏపీలో ఐదుకు ఐదు స్థానాలు కూటమి పార్టీలకే దక్కనున్నాయి. ఇందులో టీడీపీకి మూడు, జనసేన,బీజేపీలకు చెరకోటి దక్కే అవకాశం ఉంది. 2025 మార్చి 29వ తేదీతో తెలంగాణలో మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా హసన్ ఎఫెండీ పదవీ కాలం పూర్తి కానుండగా.. ఏపీలో బీటీ నాయుడు, ఆశోక్ బాబు, యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు పదవీకాలం పూర్తి కానుంది. దీంతో వీటికి ఈసీ ఈ ఎన్నికలను నిర్వహించనుంది.
నాగాబాబుకు మంత్రి పదవి?
జనసేన నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు ఖరారు కానుంది. లోక్ సభ ఎన్నికల్లో ఎంపీ సీటు త్యాగం చేసిన నాగబాబును రాజ్యసభకు పంపాలని కూటమి సర్కార్ ప్లాన్ చేసింది. కానీ ఆయన రాష్ట్ర క్యాబినెట్లో చేరేందుకు సుముఖత వ్యక్తపరిచడంతో నాగబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చి కేబినెట్ లోకి తీసుకోవాలని కూటమి సర్కార్ భావిస్తోంది.