ఉమ్మడి ఏపీ నుంచి విడిపోయి ప్రత్యేక తెలంగాణ ఏర్పడి పదేళ్లు గడిచింది. కానీ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఇంకా కృష్ణా నదీ జలాల వివాదం జరుగుతూనే ఉంది. ఉమ్మడి ఏపీ నుంచి విడిపోయి తెలంగాణ రాష్ట్రం 2014లో అవతరించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు దాటింది. కానీ తెలంగాణ, ఏపీ మధ్య ఇంకా నదీ జలాల వివాదం జరుగుతూనే ఉంది. ఇరు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, పాలకులు మారుతున్న కూడా నదీ జలాల వాటా పంపకంలో మాత్రం వివాదానికి తెర పడటం లేదు. కృష్ణా, గోదావరి నదుల్లో నీటికోసం తెలుగు రాష్ట్రాల మధ్య వాగ్వాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నీటి వాటాల కేటాయింపుల్లో ఈ లొల్లి మరింత ముదిరింది. తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి సీఎంలు కేసీఆర్, జగన్ ఓసారి సమావేశమయ్యారు. అప్పుడు ఈ నదీ జలాల వివాదం పరిష్కారం అవుతుందని అంతా భావించినప్పటికీ అలా జరగలేదు. ఇప్పుడు ప్రభుత్వాలు మారిపోయాయి. ఇటీవలే సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు కూడా సమావేశమయ్యారు. కానీ ఈసారి కూడా నదీజలాల పంపకాలకు పరిష్కారం దొరకలేదు.
కేంద్ర ప్రభుత్వం జోక్యంతో కూడా కొన్నిసార్లు ఇరు రాష్ట్రాల ఉన్నతాధికులు సమావేశమయ్యారు. అయినప్పటికీ ప్రయత్నాలు ఫలించలేదు. గోదావరి నది జలాల విషయంలో చిన్న వివాదాలు ఉన్నాయి. కానీ కృష్ణా జలాల విషయంలో మాత్రం అలా కాదు. ఇరు రాష్ట్రాలు కయ్యానికి కాలుదువ్వే స్థాయిలో వివాదాలు ఉన్నాయి. రాష్ట్రం విడిపోయి పదేళ్లు దాటిన నదీ జలాల పంపకాలపై ఇంకా స్పష్టత రాకపోవడం చర్చనీయాంశమవుతోంది.
అసలేంటి వివాదం ?
దక్షిణ భారత్లో ప్రవహించే నదల్లో కృష్ణా, గోదావరి నదులు కీలకమైనవి. ఈ రెండు కూడా తెలంగాణ, ఏపీ మాత్రమే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా ప్రవహిస్తాయి. అయితే నదీ జలాలను రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం 1969లోనే బచావత్ అనే కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నదీజలాలను ఏ రాష్ట్రం ఎంత వాడుకోవాలో నిర్ణయించింది. ఇందులో మహారాష్ట్రకు 560 టీఎంసీ, కర్ణాటకకు 700 టీఎంసీ, ఆంధ్రప్రదేశ్ 811 టీఎంసీ నీటిని కేటాయించారు. ఇక 2014లో ఏపీతో విడిపోయి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కృష్ణా నదీ జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగింది. 512 టీఎంసీలుకు ఏపీకి, తెలంగాణకు 299 టీఎంసీలు వాడుకోవాలనే నిర్ణయం జరిగింది.
కానీ, ఆ తర్వాత దీనిపై వివాదం చెలరేగింది. కృష్ణా నదీ జలాల పంపకాల్లో తమకు అన్యాయం జరిగిందని తెలంగాణ వాదించింది. తమకు అధిక నీటి వాటా కావాలని డిమాండ్ చేసింది. వాస్తవానికి కృష్ణా నది ఎక్కువగా తెలంగాణలోనే ప్రవహిస్తుంది. కాబట్టి ఏపీ కంటే తమకే ఎక్కువ నీళ్లు రావాలని అడుగుతోంది. ఉమ్మడి ఏపీలో కేటాయించిన 811 టీఎంసీల్లో 70 శాతం అంటే 558 టీఎంసీలు తమకే రావాలని తెలంగాణ వాదిస్తోంది. 50:50 వాటా కావాలనే డిమాండ్ కూడా గతంలో కేసీఆర్ చేశారు.
మరోవైపు తెలంగాణ వాదనను ఏపీ ఖండిస్తోంది. కృష్ణా జలాల్లో తమకే ఎక్కువ వాటా కావాలని డిమాండ్ చేస్తోంది. ఇలా వాటాలపైనే ఇరు రాష్ట్రాల మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. అంతేకాదు ఈ కృష్ణా నదిపై నిర్మిచే ప్రాజెక్టులపై కూడా తెలంగాణ, ఏపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఓవైపు ఏపీ అక్రమంగా ప్రాజెక్టు నిర్మిస్తోందని తెలంగాణ.. మరోవైపు తెలంగాణ అక్రమంగా నిర్మిస్తోందని ఏపీ అంటున్నాయి. దీంతో ఇలా కృష్ణా నదీ జలాలపై వివాదానికి తెరపడటం లేదు.
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిల్వ, పంటల సాగుకు నీటి విడుదల వంటి అంశాలపై నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి కృష్ణా జలాల వినియోగంపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పిటికే ఏపీ నిర్ణీత వాటా కంటే ఎక్కువగా నీటిని తరలించుకుపోతుందని.. దీనివల్ల తెలంగాణ వినియోగానికి నీరు ఉండటం లేదని అన్నారు. అందుకే ఏపీ నిర్ణీత కోటా కన్నా ఎక్కువ తరలించుకుండా జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. శ్రీశైలం, నాగార్జు సాగర్ ప్రాజెక్టుల నుంచే ఏపీ ఎక్కువగా నీటి వాటాను తరలిస్తోందని తెలంగాణ ఆరోపణలు చేస్తోంది.
సమావేశం వాయిదా
తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇటీవల దీనిపై మాట్లాడారు. కృష్ణా జలాలను ఏపీ అక్రమంగా తరలిస్తోందని ఆరోపించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి ఇరు రాష్ట్రాల మధ్య దుమారం రేపాయి. దీన్ని పరిష్కరించేందుకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు అత్యవసర సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కానీ ఏపీ విజ్ఞప్తి మేరకు ఈ సమావేశం ఫిబ్రవరి 24కి వాయిదా పడింది. మరోవైపు కృష్ణా జలాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కూడా రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కృష్ణా జలాలను ఏపీ ఎత్తుకెళ్తున్న కూడా రాష్ట్ర సర్కార్ మొద్దు నిద్ర వీడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్ కుడి కాల్వ నుంచి ఏపీ ప్రభుత్వం ప్రతీరోజు 10 వేల క్యూసెక్కుల నీటిని తరలిస్తోందని అయినప్పటికీ రేవంత్ ప్రభుత్వం చేతులు కట్టుకుని కూర్చోందని ఎద్దేవా చేశారు.
కేంద్రంపై ఒత్తిడి తేవాలి
ఈ ఏడాది కృష్ణాలో 1010 టీఎంసీల నీళ్లు రాగా.. ఇందులో ఏపీకి 666 టీఎంసీలు, తెలంగాణకు 343 టీఎంసీలు వాడుకోవాలనే నీటి ఒప్పందం జరిగినట్లు చెప్పారు. ఏపీ ఇప్పటికీ 657 టీఎంసీలు నీరు తరలించుకున్నట్లు తెలిపారు. కానీ తెలంగాణ 343 టీఎంసీలకు కేవలం 220 టీఎంసీలు మాత్రమే వినియోగించుకుందని అన్నారు. ప్రస్తుతం ఏపీకి 9 టీఎంసీలే మిగిలి ఉన్నాయని.. కానీ తెలంగాణకు 123 టీఎంసీలు రావాల్సి ఉందని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఏపీకి నీటి విడుదలను ఆపేసి తెలంగాణ వాటాను దక్కించుకోవాలని డిమాండ్ చేశారు.