బస్సునుండి దిగిపొమ్మంటూ హెచ్చరిక
ప్రయాణీకులతో గొడవలకు దిగుతూ వార్తల్లోకెక్కడం ఆర్టిసి సిబ్బందికి సర్వ సాధరణమయ్యింది. ప్రయాణీకులతో మర్యాదగా మెలగాలన్న యాజమాన్య ఆదేశాలను కొంతమంది ఖాతరు చేయని పరిస్థితి నెలకొంది. మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఇలాంటి ఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. ఓ వైపు ప్రయాణికులతో స్టాఫ్ గొడవకు దిగడం, నిత్యం ఎక్కడో ఒకచోట వార్తల్లోకెక్కడం, మరోవైపు కండక్టర్లు జీరో టికెట్ల మాటున పురుషులకు టికెట్లు ఇస్తూ సంస్థ ఆదాయానికి గండి కొడుతున్న ఘటనలను చూస్తున్నాం. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఘటన ఆర్టిసి డ్రైవర్, కండక్టర్ల అహంకారానికి పరాకాష్టగా నిలిచింది. హనుమకొండలో ఓ యువ జర్నలిస్టు తన కూతురికి ఉరేసి, తాను కూడా ఉరేసుకుని బలవ్మరణానికి పాల్పడ్డాడు. అయితే, జనగామలో జరిగే అంత్యక్రియలకు హజరయ్యేందుకు ఓ నలుగురు జర్నలిస్టులు హనుమకొండలో ఆర్టిసి బస్సు ఎక్కారు.
దీంతో డ్రైవర్, కండక్టర్ ఒక్క బస్సులో ఇలా ఎంతమంది ఎక్కుతారంటూ వారితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. వెంటనే బస్సులోంచి దిగిపోవాలని హుకూం జారీ చేశారు. అదేంటని ప్రశ్నిస్తే, మీ ఇష్టం ఉన్నచోట చెప్పుకోండంటూ కండక్టర్ బెదిరింపులకు దిగాడు. బస్సు పాసు లాక్కొని డిపోలో అప్పగిస్తామని, అక్కడ తేల్చుకుందాం పదా అంటూ కామెంట్ చేశారు. ప్రజా శ్రేయస్సుకు, సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తూ.. సమిధలవుతోన్న జర్నలిస్టుల పట్ల ఆర్టిసి సిబ్బంది అమర్యాదగా ప్రవర్తించడం సరికాదని పలు జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. వెంటనే ఘటనకు కారణమైన డ్రైవర్, కండక్టర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని బాధిత జర్నలిస్టులు ఆర్టిసి ఎండీ సజ్జనార్, ఇతర ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు.