పట్టాభిషిక్తుడైన భద్రాద్రి రామయ్య
పట్టువస్త్రాలు సమర్పించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
ప్రముఖ పుణ్యక్షేత్రమై సీతారాచంద్ర స్వామి దేవస్ధానం ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. కల్యాణ రాముడు పట్టాభిరాముడిగా మారారు. ఆ తరువాత భద్రాచలంలోని కల్యాణ రామునికి సోమవారం శ్రీరామమహాపట్టాభిషేకం వైభవోపేతంగా జరిగింది. మిథిలా ప్రాంగణం అంతా పులకించింది. ఈ అపురూపమైన ఘట్టాన్ని భక్తుల జయజయ ధ్వానాల మధ్య భక్తులు పులకించిపోయారు. భద్రాద్రి రాముడు పట్టాభిషిక్తుడైన శ్రీరామునికి స్వర్ణ కిరీటధారణ గావించారు. గత కొంతకాలంగా ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయంను కొనసాగిస్తూ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు రాష్ట్రప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మిథిలా స్టేడియంలో శ్రీరామ మహాపట్టాభిషేక వేడుక కన్నుల పండుగగా సాగింది.
స్వామివారికి కల్యాణ తంతును భద్రాచలం దేవస్థానం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించగా సోమవారం పట్టాభిషేక మహోత్సవాన్ని జరిపారు. ముందుగా సీతారామచంద్ర స్వామి కల్యాణమూర్తులను అందంగా అలంకరించిన పల్లకిలో మంగళవాయిద్యాలు, మేళ తాళాల కోలాటాల మధ్య మిథిలా మండపం వేదిక వద్దకు తీసుకువచ్చారు. ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కళ వాహన, మండపారాధన నిర్వహించారు. అదే విధంగా అష్టదిక్పాలకులకు, త్రిమూర్తులను ఆవాహన చేశారు. అనంతరం శ్రీరామపట్టాభిషేక మంత్ర సంపుటిత అష్టోత్తర శత నామార్చన వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామపట్టాభిషేక విశిష్టతను ఆలయ అర్చకులు వివరించారు. అభిజిత్ లగ్నంలో సమస్త నదీజలాలతో ప్రోక్షణ నిర్వహించారు. అదే విధంగా వేదపండితుల వేదమంత్రాల మధ్య రామయ్యకు లాంచనాల్లో భాగంగా స్వామివారి పట్టాభిషేక ఆభరణాలను ఒక్కొక్కటి భక్తులకు చూపిస్తూ అలంకరించారు. ముందుగా శ్రీరామపాదుకలకు అర్చక స్వాములు అభిషేకం జరిపారు.
రాజలాంఛనాలతో పవిత్ర పావన నదితీరం నుండి తీర్ధ బిందెలతో నీటిని తీసుకువచ్చారు. రాజదండం, రాజముద్రిక, స్వర్ణచత్రం, చామరం స్వామివారికి సమర్పించారు. అనంతరం రామయ్యకు పట్టాబిషేకాన్ని పురస్కరించుకుని రాజమకుటంను ధరింపచేశారు. రాష్ట్ర గవరర్నర్ జిష్ణుదేవ్వర్మ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.అలాగే రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
తర్వాత స్వామివారికి చతుర్వేదపారాయణం నిర్వహించారు. నదీజలాలతో స్వామివారికి ప్రోక్షణ చేసిన అనంతరం భక్తులపై మహాకుంభ తీర్థాన్ని ప్రోక్షణం గావించారు. అనంతరం హనుమంతునికి ముత్యాలదండను బహుకరించారు. అష్టోత్తర శతహారతి ఇవ్వడంతో మహాపట్టాభిషేక గట్టం ముగిసింది. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, భద్రాచలం శాసన సభ్యులు డా. తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి రాహుల్, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు.