•కమీషన్లు, అక్రమ వసూళ్ల కోసమే హైడ్రా
•మాజీ మంత్రి కేటీఆర్
అక్రమ వసూళ్ల కోసమే కాంగ్రెస్ పార్టీ హైడ్రాను తీసుకొచ్చిందని మాజీమంత్రి కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను గాలికి వదిలేసి.. కమీషన్లు ఎక్కడ వస్తాయో అక్కడ దృష్టి పెట్టిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. హైడ్రా పేరుతో వసూళ్ల దందా.. మూసీ పేరుతో పేదల ఇండ్లపై పగబట్టిందని విరుచుకుపడ్డారు కేటీఆర్. ఫార్మాసిటీ పేరుతో భూముల చెర.. ఫోర్త్ సిటీ పేరుతో సీఎం కుటుంబ రియల్ వ్యాపారం చేస్తుందని ఆరోపించారు. ట్రిపుల్ ఆర్ పేరుతో పేదల భూముల ఆక్రమించుకుంటుందన్నారు. పేదలపై ప్రతాపం చూపిస్తూ.. పెద్దలతో ఒప్పందాలు కుదుర్చుకుంటుందన్నారు. నాడు మద్యం వద్దని చెప్పిన రేవంత్ రెడ్డి.. నేడు మద్యం ముద్దు అంటున్నారని పేర్కొన్నారు.
ధరల సవరణ పేరుతో, కొత్త బ్రాండ్ల పేరుతో అక్రమ ఒప్పందాలు చేసుకుంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలు గాలికి వదిలేసి.. వాటిపై ప్రశ్నించిన వారిని జైలుకు పంపిస్తున్నారని తెలిపారు. రైతుభరోసా రాదు.. రుణమాఫీ కాదు.. పంటలు కొనుగోలు చేయరు.. రూ.500 క్వింటాలు ధాన్యానికి బోనస్ బోగస్ అయింది.. తులం బంగారం ఇయ్యరు.. ఉద్యోగాలు వేయరు.. ఉద్యోగులకు పీఆర్సీ రాదు, డీఏలు ఇవ్వరు అని కేటీఆర్ మండిపడ్డారు. సత్యం వధ.. ధర్మం చెర బట్టిందన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో దేశానికే దిక్సూచిగా ఎదిగిన తెలంగాణను.. 15 నెలల కాంగ్రెస్ పాలనలో అధం పాతాళానికి తీసుకెళ్లారు. ఆర్థికశక్తిగా ఎదిగిన తెలంగాణను ఆగం చేసి బీద అరుపులు అరుస్తున్నారు. ఇది పాలన కాదు పీడన.. ఇది సర్కారు కాదు సర్కస్ కంపెనీ అని రేవంత్ రెడ్డి సర్కార్పై కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ పాలనలో రైతన్నలను వెంటాడుతున్న కష్టాలు
కాంగ్రెస్ పాలనలో రైతన్నలను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయని మాజీమంత్రి కేటీఆర్ అన్నారు. సాగుకు సరిపడా విద్యుత్, నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. రైతు రుణమాఫీ కాక, రైతు భరోసా నిధులు విడుదల కాకపోవడంతో అన్నదాతలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ఈ పరిస్థితులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ముంచుకొస్తున్న ముప్పును ముందే హెచ్చరించినా.. ఈ తెలివిలేని కాంగ్రెస్ సర్కారు తలకెక్కలేదు అని కేటీఆర్ విమర్శించారు. కల్వతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షగట్టొద్దని మొత్తుకున్నా విషం తప్ప విషయం లేని ముఖ్యమంత్రి వినిపించుకోలేదు.
కళ్ల ముందే పచ్చని పంటలు ఎండుతున్నాయని వ్యవసాయ శాఖ సమర్పించిన ప్రాథమిక నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని కేటీఆర్ పేర్కొన్నారు. ఓవైపు రుణమాఫీ కాక, పెట్టుబడి సాయం రాక అన్నదాత అల్లాడుతున్న సమయంలో గోరు చుట్టు మీద రోకలి పోటులా పంటలు ఎండటంతో రైతు బతుకు ఆగమైంది. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ కక్షగట్టి తెచ్చిన కరువు కాబట్టి రైతులను ఆదుకునే పూర్తి బాధ్యత ముఖ్యమంత్రిదే. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో.. ఎండిన ప్రతి ఎకరానికి వెంటనే రూ.25 వేల నష్ట పరిహారం ప్రకటించి వెంటనే చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూస్తే రైతులతో కలిసి కాంగ్రెస్ సర్కారు భరతం పడతాం అని కేటీఆర్ హెచ్చరించారు.