-
గత ప్రభుత్వం రాష్ట్ర రుణాన్ని పదింతలు పెంచింది
-
తెలంగాణ ప్రజలకు అప్పులు, కల్వకుట్ల కుటుంబానికి ఆస్తులు పెరిగాయి
-
తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్
గత ప్రభుత్వం రాష్ట్ర రుణాన్ని పదింతలు పెంచిందని, తెలంగాణ ప్రజలకు అప్పులు, కల్వకుట్ల కుటుంబానికి ఆస్తులు పెరిగాయని తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. కేవలం ఎనిమిది నెలల్లో రేవంత్ సర్కార్ చేసిన అప్పులు అని, బిఆర్ఎస్ పార్టీ చేసిన ట్వీట్కు కాంగ్రెస్ కౌంటర్ ఇస్తూ గత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ సందర్భంగా కెసిఆర్ గత పదేళ్లలో తెలంగాణ ప్రజలకు అప్పులు, కల్వకుంట్ల వారసులకు ఆస్తులు పంచి పెట్టిందని విమర్శలు చేసింది. తెలంగాణ ఆవిర్భావం నాటికి రూ.75,577 కోట్ల అప్పులున్నాయని, అవి 2021-,22 నాటికి అవి రూ.2.83 లక్షల కోట్లకు చేరాయని కేంద్రం తెలిపినట్లు పేర్కొంది.
ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు లక్షా 50 వేల కోట్లు అప్పు తీసుకున్నాయని, 12 బ్యాంకుల నుంచి కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు లక్షా 30 వేల కోట్లని తెలిపింది. అలాగే 2022 అక్టోబర్ నాటికి తెలంగాణకు రూ.4,33,817.6 కోట్ల అప్పు ఉన్నట్లు కేంద్రం వెల్లడించిందన్నారు. ఇక 2014 నుంచి బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రం రుణాన్ని భారీగా పెంచిందని, 2014లో సుమారు రూ.72,658 కోట్ల నుంచి 2024 నాటికి సుమారు రూ.7.11 లక్షల కోట్లు పెరిగిందని, ఈ కాలంలో రాష్ట్ర రుణం పదింతలు పెరిగిందని కాంగ్రెస్ తెలిపింది.