- ఇంకెన్నాళ్లీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు..
- 10 లక్షల ఎకరాల పంట ఎండిపోతున్నా పట్టింపులేదా?
- 6 గ్యారంటీలపై చర్చించే దమ్ముందా?
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
తమిళనాడులో డీఎంకే, కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాల పరిస్థితి దారుణంగా ఉందని, ప్రజలు అసహ్యించుకుంటున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.
కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీలిమిటేషన్ పై కేంద్రం గైడ్ లైన్స్ రూపొందించలేదని, ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని చెప్పారు. నిర్ణయమే తీసుకోనప్పుడు దక్షిణాదికి అన్యాయం చేస్తున్నారని ఆరోపించడం హాస్యాస్పదమన్నారు. అసెంబ్లీ లో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ నిర్ణయం కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలో భాగమేనన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ఆ రెండు పార్టీలకు దిక్కుతోచడం లేదన్నారు. అందుకే అసెంబ్లీలో సస్పెన్షన్ పేరుతో బీఆర్ఎస్ కు మరో ఆయుధాన్ని కాంగ్రెస్ అందించిందన్నారు. బీఆర్ఎస్ పార్టీని జాకీ పెట్టినా లేపినా ప్రజలు నమ్మడం లేదనే విషయాన్ని కాంగ్రెస్ గుర్తుంచుకోవాలన్నారు.
ఈరోజు కరీంనగర్ లో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు తదితరులతో కలిసి బండి సంజయ్ మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే పార్టీల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏమన్నారంటే…. రాజాసింగ్ వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా స్పందిస్తూ… రాజాసింగ్ వ్యాఖ్యలను నేను వినలేదు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే రహస్య భేటీలు జరుగుతున్నాయి. రెండు పార్టీలు ఒక్కటే. ఆ రెండు కలిసి బీజేపీని బదనాం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏమిచ్చిందో ముందు సమాధానం చెప్పాలి. రైతులకు భరోసా నిధులివ్వడం లేదు. రుణమాఫీని పూర్తిగా అమలు చేయలేదు. ఉద్యోగులకు డీఏలు ఇవ్వలేదు.
రిటైర్డ్ మెంట్ బెన్ ఫిట్స్, మెడికల్ బిల్స్ ఇవ్వడం లేదు. నిరుద్యోగులకు భృతి ఇవ్వడం లేదు. పెన్షన్లు రూ.4 వేలు ఎందుకు ఇవ్వడం లేదు. మహిళలకు తులం బంగారం, నెలకు రూ.2500 ఊసే లేదు. చేసిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్స్ ఇవ్వడం లేదు. మాజీ సర్పంచులకు పెండింగ్ బిల్స్ ఊసే లేదు. కాలేజీలకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వడం లేదు… అసలు మీరు ప్రజలకు చేస్తోందేమిటి? పదేపదే కేంద్రంపై ఏడవడం తప్ప కాంగ్రెస్ సాధించిందేమిటి? స్మార్ట్ సిటీ నిధులను కేంద్రం మంజూరు చేస్తే రాష్ట్ర వాటా ఇవ్వడం లేదు. కేంద్రం వివిధ పథకాలకు నిధులిస్తే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం లేదు. అయినా కేంద్రాన్ని బదనాం చేయడమంటే సూర్యుడిపై ఉమ్మేసినట్లే. గతంలో కేసీఆర్ కూడా ఇట్లనే బదనాం చేయాలనుకున్నరు. ఏమైంది? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని దించేశారు. మళ్లీ కాంగ్రెస్ అదే పాట పాడుతోందన్నారు.