- బుద్ధుడి ఆలోచనలు జ్ఞానాన్ని, శాంతిమార్గాన్ని బోధిస్తాయి
- బుద్ధుడి స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగిస్తున్నాం: సిఎం రేవంత్రెడ్డి
గౌతమ బుద్ధుడిని ప్రపంచం మొత్తం అనుసరిస్తుందని ఆయన ఆలోచనలు జ్ఞానాన్ని, శాంతిమార్గాన్ని బోధిస్తాయని, బుద్ధుడి స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగిస్తున్నామని సిఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. బుద్ధపూర్ణిమ సందర్భంగా గురువారం సికింద్రాబాద్లోని మహాబుద్ధ విహారను సిఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ బుద్ధ విహార సందర్శనతో గొప్ప క్షేత్రాన్ని సందర్శించిన అనుభూతి కలిగిందన్నారు.
రాజ్యం, అధికారం ఉండి వాటిని కాదని 29 ఏళ్ల వయసులో శాంతి కోసం బుద్ధుడు ఆలోచించారన్నారు. రెండున్నర వేల సంవత్సరాలుగా బౌద్ధ సిద్ధాంతం నిలబడి ఉందని సిఎం రేవంత్ కొనియాడారు. ప్రతి పనిని ధ్యానంగా చేయాలన్న సూచనలో చాలా అర్థం ఉందని, ఈ సూక్తి నుంచి ఎంతో స్ఫూర్తిని పొందానని, ఏ పని అయినా తాను ఎంతో ధ్యానంగా చేస్తానన్నారు. పూర్తిస్థాయిలో కాకున్నా పనిలో కొంతమేరకైనా ధ్యానంగా ఉండేందుకు తాను ప్రయత్నిస్తానని సిఎం రేవంత్ తెలిపారు.
బుద్ధవిహార్కు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుంది
మహాబోధి బుద్ధవిహార్కు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. సమాజంలో అసహనం, అసూయ పెరిగిపోతున్నాయని, మనస్పర్థలు, ఉద్వేగాలు పెరిగేలా వాతావరణం నెలకొందని, బుద్ధుని సందేశం దేశానికి ఇప్పుడు ఎంతో అవసరమన్నారు. బుద్దుని సందేశాన్ని సమాజంలో ప్రతి ఒక్కరికీ చేరవేయడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఈ ప్రభుత్వం మీది అన్ని రకాల సహాయ, సహకారాలు ఉంటాయని, తెలంగాణలో బౌద్ధ బిక్షులకు తగిన గౌరవం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
ధ్యానమందిరం కోసం ప్రతిపాదనలు పంపితే ఎన్నికల కోడ్ ముగిశాక నిధులు మంజూరు చేస్తామని సిఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సమాజంలో అశాంతి, అసూయను అధిగమించాల్సిన బాధ్యత అందరిదని మంచి సందేశం, ఆలోచనను పెంపొందించుకోవా లన్నారు. సమాజానికి మేలు చేయాలన్న ఆలోచనను ఇతరులకు పంచాలని గౌతమ బుద్ధుడు బోధించిన సందేశం అందరికీ అవసరమని ఆయన వ్యాఖ్యానించారు.