-
ట్యాంక్బండ్తో పాటు ప్రధాన మండపాలు,
-
చెరువుల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలి
-
ప్రతి గంటకు ఒకసారి సిబ్బందికి కమాండ్ కంట్రోల్ నుంచి సూచనలు
జారీ చేయాలి
-
బ్లైండ్ స్పాట్స్, హాట్ స్పాట్స్లకు సంబంధించి రికార్డు మెయింటెన్స్ చేయాలి
పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన సిఎం రేవంత్రెడ్డి
ట్యాంక్బండ్తో పాటు ప్రధాన మండపాలు, చెరువుల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని సిఎం రేవంత్ పోలీసులను ఆదేశించారు. పర్యవేక్షణతో పాటు ప్రతి గంటకు ఒకసారి సిబ్బందికి కమాండ్ కంట్రోల్ నుంచి సూచనలు ఇచ్చి అలర్ట్ చేయాలని సిఎం రేవంత్ సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని సిఎం ఆదేశించారు. బ్లైండ్ స్పాట్స్, హాట్ స్పాట్స్లకు సంబంధించి రికార్డు మెయింటెన్స్ చేయాలని సిఎం సూచించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. నవరాత్రులు పూర్తి చేసుకున్న గణపయ్యను నిమజ్జనం చేసేందుకు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వినాయక విగ్రహాల నిమజ్జనం ఏర్పాట్లపై సిఎం రేవంత్ రెడ్డి సోమవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో పోలీసులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్షకు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్యాంక్బండ్ సహా నగరంలో వినాయక నిమజ్జనాల కోసం ఏర్పాటు చేసిన చెరువుల వివరాలను కమిషనర్ సివి ఆనంద్ సిఎంకు వివరించారు. ఈ క్రమంలోనే గ్రేటర్ వ్యాప్తంగా నిమజ్జనాల పర్యవేక్షణ కోసం ట్యాంక్బండ్, మండపాలు, చెరువుల దగ్గర మొత్తం 733 సిసి కెమెరాలతో నిమజ్జన ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్లు సిపి ముఖ్యమంత్రితో తెలిపారు. అలాగే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి వాటి పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని సిపి పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వినాయక నిమజ్జనంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సిఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.