Monday, April 21, 2025

రాయచోటిలో విషాదం – గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురి సజీవదహనం

రాయచోటిలో విషాదం – గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురి సజీవదహనం గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి చెందిన విషాదకర ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్​లోని అన్నమయ్య జిల్లా రాయచోటిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తల్లి, కుమారుడు, కుమార్తె ఇంట్లోనే మంటల్లో చిక్కుకుని చనిపోయారు. ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. రాయచోటిలో తల్లి, కుమారుడు, కుమార్తె వారు ఉంటున్న ఇంట్లోనే సజీవ దహనం అయ్యారు. రమాదేవి అనే మహిళ తొగటవీధిలో పిల్లలతో కలిసి ఉంటోంది. ఆమె భర్త జీవనోపాధి కోసం కువైట్‌ వెళ్లారు. ఇంట్లో నుంచి ఒక్కసారిగా పొగలు వస్తుండటాన్ని స్థానికులు గుర్తించారు. లోపలి నుంచి గడియపెట్టి ఉండటంతో తలుపులు తెరుచుకోలేదు.
అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

ఘటనా స్థలికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు. ఇంట్లోకి వెళ్లి చూడగా అప్పటికే రమాదేవి, తొమ్మిదేళ్ల కుమారుడు మనోహర్‌, ఐదేళ్ల మాన్విత మంటల్లో చిక్కుకుని చనిపోయారు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ లీకేజ్ కావడం వల్లే మంటలు చెలరేగి చనిపోయారా? లేక వారే పెట్రోల్ లేదా కిరోసిన్ పోసుకొని తగులబెట్టుకున్నారా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కువైట్‌లో ఉన్న భర్త రమాదేవిని ఎప్పుడూ అనుమానిస్తుండే వాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఆ గొడవ కారణంగానే!

ఈ క్రమంలోనే మృతురాలు రమాదేవిపై అనుమానంతో ఇంటి బయట, బెడ్ రూమ్‌, వంట గదిలో కూడా సీసీ కెమెరాలు అమర్చినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని చెప్పారు. శుక్రవారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. ఆ గొడవ కారణంగానే రమాదేవి బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. స్థానికులను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని రాయచోటి డీఎస్పీ రామచంద్ర తెలిపారు.

మంత్రి పరామర్శ

రాయచోటిలోని ఘటనా స్థలానికి వెళ్లిన ఏపీ మంత్రి రామ్‌ప్రసాద్ రెడ్డి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఘటనకు కారణాలను వెలికి తీయాలని, బాధితులకు న్యాయం చేయాలని పోలీసులను ఆదేశించారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు సామరస్యంగా పరిష్కరించుకోవాలే తప్ప, ఇలాంటి చర్యలకు పాల్పడితే చాలా బాధాకరమని అన్నారు. ఈ ఘటనపై అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇంటిలోని సీసీ కెమెరాల ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాలు పరిశీలించి నిజానిజాలు తెలుసుకుంటామని డీఎస్పీ వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రమాదేవి బంధువులతో పాటు మరికొంతమందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com