తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు అనుమతి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనాన్ని కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నది. ఈ విధానం మార్చి 24 నుండి అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి తెలంగాణ ప్రజాప్రతినిధుల నుండి సిఫార్సు లేఖలను ఆది, సోమ, వారాల్లో మాత్రమే స్వీకరించనున్నారు. (సోమ, మంగళవారం దర్శనాలకు గాను) అదేవిధంగా రూ. 300 దర్శనం టికెట్లకు సంబంధించి సిఫార్సు లేఖలను బుధ, గురు వారాలలో మాత్రమే స్వీకరించడం జరుగుతుందని ప్రకటించారు. ఒకరికి ఒక సిఫార్సు లేఖను 06 మందికి మించకుండా స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు సోమవారం విఐపి బ్రేక్ దర్శనానికి గాను ఆదివారం ఆంధ్ర ప్రజాప్రతినిధుల నుండి స్వీకరిస్తున్న సిఫార్సు లేఖలు ఇకపై శనివారం స్వీకరిస్తారు. తిరుమలలో అందుబాటులో ఉన్న వసతి సౌకర్యాలను, ఇతర భక్తుల దర్శన సమయాలను దృష్టిలో ఉంచుకుని సుదీర్ఘంగా చర్చించిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న అనంతరం టీటీడీ నిర్ణయించింది.