ఎస్సీ వర్గీకరణ, బిసి రిజర్వేషన్లపై చర్చ
ఉదయం కేబినేట్ భేటీలో బిసి నివేదికకు ఆమోదం
అసెంబ్లీకి కెసిఆర్ రావాలన్న మంత్రి పొన్నం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : ఎస్సీ వర్గీకరణ, బిసి కులగణపై మంగళవారం నాటి అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇందుకోసం అసెంబ్లీ ఒకరోజు సమావేశం కాబోతున్నది. సుప్రీం తీర్పునకు అనుగుణంగా చర్చించి ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ప్రత్యేక సమావేశానికి రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విపక్ష నేత కెసిఆర్కు సూచించారు. ఆయన వస్తారా లేదా అన్నది అనుమానంగానే ఉంది. ఇదిలా ఉంటే బిసి కమిషన్ నివేదికను ఉదయం జరిగే కేబినేట్ సమావేశంలో చర్చించి ఆమోదిస్తారు. అనంతరం అసెంబ్లీలో చర్చకు పెడతారని అంటున్నారు.
కాగా ఎస్సీ వర్గీకరణపై క్యాబినెట్ సబ్ కమిటీ ఛైర్మన్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశం జరిగింది. క్యాబినెట్ సబ్ కమిటీకి, ఏకసభ్య కమిషన్ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమ్ అఖ్తర్ మధ్య కీలక భేటీ కొనసాగింది. ఈ సమావేశంలో ఉత్తమ్ కుమార్ తో పాటు కమిటీ వైస్ ఛైర్మన్ దామోదర రాజనర్సింహ, మంత్రి పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యాబినెట్ సబ్ కమిటీకి ఎస్సీ వర్గీకరణ నివేదికను ఏక సభ్య కమిషన్ అందజేసింది. ఆగస్టు 1వ తేదీ, 2024న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే, తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు అధ్యయనం కోసం రాష్ట్ర సర్కార్ 2024 అక్టోబర్ 11న హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమ్ అక్తర్ ను ఏకసభ్య కమిషన్గా నియమించింది.
రెండు నెలల్లో అధ్యయనం చేసి తుది నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి ఇవ్వాలని సూచించింది. దీంతో అధ్యయనం పూర్తి చేసిన కమిషన్ ఈరోజు సబ్ కమిటీకి రిపోర్టును అందజేసింది. కేబినెట్ సబ్ కమిటీ తిరిగి మరోసారి సమావేశం అయ్యింది. సచివాలయంలో చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన భేటీలో మళ్లీ సమావేశం అయ్యారు. కాగా, మంగళవారం జరిగే ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో తెలంగాణ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది వేచి చూడాల్సిందే. ఈ సమావేశాల్లోనే బిసి రిజర్వేషన్లు, కులగణనపై సుదీర్ఘ చర్చ జరుపబోతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉదయం జరిగే కేబినెట్లో ప్రభుత్వం నిర్ణయం ప్రకటిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే, కుల సర్వే కు సంబంధించి శాసనసభలో తీర్మానం చేసుకొని ప్రత్యేక కమిషన్ వేసుకున్నామని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి, మంత్రులు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ పక్రియ పూర్తి అయ్యిందన్నారు. అది కార్యరూపం దాల్చడానికి ఈ సమావేశం నిర్వహించామని మంత్రి తెలిపారు. వర్గీకరణపై సబ్ కమిటీ తీసుకున్న ప్రిగేసివ్ యాక్టివిటీస్పై చర్చించామని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లు, కులగణన నివేదికపై చర్చకు పెట్టి ప్రజాస్వామిక విధానం ద్వారా వాటిని ముందుకు తీసుకుపోవాలన్నదే తమ నాయకుడి ఉద్దేశ్యమని మంత్రి పొన్నం తెలిపారు.
తమ పార్టీ లక్ష్యం దేశంలోనే ఒక చారిత్రాత్మక మార్పు తీసుకురావడమేనని ఆయన పేర్కొన్నారు. దేశం మొత్తానికి రోల్ మోడల్ కావాలన్న ఉద్ధేశ్యంతో అన్నిరకాల అంశాలను చర్చించడం జరిగిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రెండు గంటల్లోనే ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో ప్రకటన చేశామని, వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణపై సిఎం రేవంత్ కేబినెట్ సబ్ కమిటీ వేశారని, సబ్ కమిటీ సూచన మేరకు వన్ మ్యాన్ కమిషన్ను నియమించారని ఆయన తెలిపారు. రిపోర్టుపై కేబినెట్లో చర్చించి, అసెంబ్లీలో ప్రవేశపెడుతామని ఆయన తెలిపారు.
డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్కతో బిసి కమిషన్ సమావేశం
రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, బీసీ కమిషన్ సభ్యులు మహాత్మా జ్యోతిబాపూలే ప్రజా భవన్ లో డిప్యూటీ సిఎం, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తో సోమవారం భేటీ అయ్యారు. ఇప్పటికే బీసీ కమిషన్ 10 ఉమ్మడి జిల్లాల పర్యటన తర్వాత వచ్చిన విజ్ఞప్తుల మేరకు కొన్ని కులాల పేర్లు మార్పు మరియు ఏమైనా అభ్యంతరాలుంటే స్వీకరించిన తర్వాత వొచ్చిన అన్ని అంశాలను బిసి కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాల లక్ష్మీ రంగు, డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్కతో చర్చించారు. వివిధ విజ్ఞప్తులను వాటి పర్యవసానాలను మంత్రితో కూలంకషంగా చర్చించారు. బిసి కమిషన్ కు మరిన్ని అధికారాలు కల్పిస్తూ చట్ట సవరణ చేయాల్సిన విషయమై మాట్లాడారు.