Tuesday, April 15, 2025

నేడు భూ భార‌తి చట్టం, పోర్ట‌ల్ జాతికి అంకితం

రాష్ట్రంలో 3 పైల‌ట్ మండ‌లాల ఎంపిక‌
జూన్ 2 నాటికి రాష్ట్రవ్యాప్తంగా అమ‌లు
శాస‌న‌స‌భ ఎన్నిక‌ల‌కు భూభారతి రిఫ‌రెండం
వొచ్చేనెల మొద‌టివారం గ్రామ‌ప‌రిపాల‌నాధికారులు
ధ‌ర‌ణి పేరిట కొల్ల‌గొట్టిన భూముల‌పై ఫోరెన్సిక్ ఆడిట్‌
రెవెన్యూ  శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

రాష్ట్రంలో అంద‌రి భూములకు భద్ర‌త క‌ల్పించ‌డ‌మే ప్ర‌ధాన ధ్యేయంగా భూ భార‌తి చ‌ట్టాన్ని, భూభార‌తి పోర్ట‌ల్‌ను అందుబాటులోకి తెస్తున్నామ‌ని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి వెల్ల‌డించారు. ఆదివారం ఆయ‌న స‌చివాల‌యంలోని త‌న ఛాంబ‌ర్‌లో మీడియాతో ఇష్టాగోష్టి నిర్వ‌హించారు. డాక్ట‌ర్ అంబేడ్కర్ 134వ జ‌యంతి సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సోమ‌వారం ఈ భూభార‌తి చ‌ట్టాన్ని, పోర్ట‌ల్‌ను ప్ర‌జ‌ల‌కు అంకితం చేస్తార‌ని తెలిపారు. రాష్ట్రంలో రైతుల భూముల ప‌రిర‌క్ష‌ణ బాధ్య‌త ఈ ప్ర‌భుత్వానిదే. ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు.

అధికారంలోకి వొస్తే ధ‌ర‌ణిని బంగాళాఖాతంలో క‌లుపుతామ‌ని మేమిచ్చిన హామీని విశ్వ‌సించి ప్ర‌జ‌లు మాకు అధికారం కట్ట‌బెట్టారు. ప్ర‌జ‌ల విశ్వాసాన్ని నిల‌బెట్టుకుంటూ ధ‌ర‌ణిని బంగాళాఖాతంలో వేసి అంద‌రికీ ఆమోద‌యోగ్య‌మైన భూ భార‌తి చ‌ట్టాన్ని తీసుకురావ‌డం ఇందులో రెవెన్యూశాఖ మంత్రిగా త‌న‌కు భాగ‌స్వామ్యం అయ్యే అవ‌కాశం వొచ్చినందుకు త‌న జ‌న్మ ధ‌న్య‌మైంద‌న్నారు. రాష్ట్రంలో తొలుత మూడు జిల్లాల‌లోని మూడు మండ‌లాల‌లో ప్ర‌యోగాత్మ‌కంగా భూభార‌తి చ‌ట్టాన్ని అమ‌లు చేయ‌బోతున్నాం. ఈ మూడు మండ‌లాల‌లో వొచ్చిన ఫ‌లితాల‌ను దృష్టిలో పెట్టుకొని జూన్ 2వ తేదీ నాటికి పూర్తిస్ధాయిలో అమ‌లు చేస్తామ‌ని తెలిపారు.

భూభార‌తి చ‌ట్టం 2029 శాస‌న‌స‌భ ఎన్నిక‌ల‌కు మాకు రిఫ‌రెండ‌మని గ‌తంలో శాస‌న‌స‌భ‌లోనే ప్ర‌క‌టించడం జ‌రిగింద‌ని, ఇప్పుడు కూడా మ‌రో మారు స్ఫ‌ష్టం చేస్తున్నాన‌ని తెలిపారు. భూముల‌పై రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ముఖ్యంగా రైతాంగానికి ఒక భ‌రోసా , భ‌ద్ర‌త క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ చ‌ట్టం రూపొందించాం. గ‌తంలో మాదిరిగా రాత్రికి రాత్రే ఇద్ద‌రు వ్య‌క్తులు క‌లిసి చ‌ట్టాన్ని రూపొందిస్తే మా ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల అభిప్రాయాల‌కు అనుగుణంగా రైతులు మేధావులు నిపుణుల‌తో చ‌ర్చించి చ‌ట్టాన్ని రూపొందించాం.గతంలో చెప్పిన‌ట్లుగానే భూ భార‌తి అమ‌లులోకి వ‌చ్చిన త‌ర్వాత ధ‌ర‌ణి ముసుగులో జ‌రిగిన భూ అక్ర‌మాల‌పై ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తామ‌ని తెలిపారు

ఒకే సారి పోర్ట‌ల్‌లో ప్ర‌వేశించ‌వ‌ద్దు
ఒకేసారి భూ య‌జ‌మానులు త‌మ భూమి వివ‌రాలు తెలుసుకునేందుకు పోర్ట‌ల్‌ను సంద‌ర్శించ‌వ‌ద్ద‌ని మంత్రి పొంగులేటి విజ్ఞ‌ప్తి చేశారు. దీనివ‌ల‌న మొత్తం పోర్ట‌ల్ ఆగిపోయే ప్ర‌మాదం ఉంద‌న్నారు. అంతేగాక కొంత‌మంది ఉద్దేశ పూర్వ‌కంగా పోర్ట‌ల్‌ను స్ట‌క్ చేయాల‌ని భావిస్తే త‌గు చ‌ర్య‌లు తీసుకోవాలంటే ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పోలీసు అధికారుల‌ను ఆదేశించార‌ని మంత్రి తెలిపారు. కేంద్ర‌ప్ర‌భుత్వ ఎన్ ఐ సి ఆధ్య‌ర్యంలో నిర్వ‌హించే పోర్ట‌ల్ లో ఆధునిక అంశాల‌ను జోడిస్తూ అత్యాధునిక వెర్ష‌న్‌ను ప్ర‌జ‌ల‌కు అందించే ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. రిజిస్ట్రేషన్ల‌కు ఆటంకం లేకుండా పోర్ట‌ల్ అభివృద్ది సాగుతుంది. వొచ్చేనెల మొద‌టివారంలో గ్రామ రెవెన్యూ పాల‌నా అధికారుల‌ను అమ‌లులోకి తెస్తాం. ఇప్ప‌టికే ఇందుకు సంబంధించిన ప్ర‌క్రియ ప్రారంభించాం.

గ‌తంలో ధ‌ర‌ణిని తీసుకువ‌చ్చిన స‌మ‌యంలో దాదాపు 4 నెల‌ల పాటు రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. ఇప్పుడు ఆ ప‌రిస్ధితి లేకుండా క్ర‌మ క్ర‌మంగా పోర్ట‌ల్‌ను అభివృద్ది చేస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా భూభార‌తి చ‌ట్టం, పోర్ట‌ల్ అమలుకు సంబంధించి ఎంపిక చేసిన ప్రయోగాత్మ‌క గ్రామాల్లో స్వ‌యంగా తాను ప‌ర్య‌టిస్తాన‌ని మంత్రి పొంగులేటి వెల్లడించారు. అదేవిధంగా సంబంధిత మంత్రులు కూడా పర్య‌టిస్తార‌ని తెలిపారు. అలాగే క‌లెక్ట‌ర్ల ఆధ్వ‌ర్యంలో అవ‌గాహ‌న స‌ద‌స్సులు నిర్వ‌హించేందుకు నిర్ణ‌యించాం. భూభార‌తిలో ఎమ్మార్వో  స్థాయి నుంచి సిసిఎల్ వ‌ర‌కు సుమారు ఐదు స్ధాయిల‌లో భూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి వీలుగా అధికారాలు వికేంద్రీక‌ర‌ణ చేశాం. అంతేగాక ప్ర‌జ‌ల నుంచి వొచ్చే ఫిర్యాదుల సంఖ్య ఆధారంగా ట్రిబ్యున‌ల్స్ ఏర్పాటు చేస్తాం. త‌ర్వాత కాలంలో సమ‌స్య‌లు త‌గ్గితే ట్రిబ్యున‌ల్స్‌ను కుదిస్తాం. ధ‌ర‌ణిలో గ‌తంలో ఉండే 33 మాడ్యూల్స్‌ను ఆరు మాడ్యూల్స్‌కు త‌గ్గించామ‌ని దీనివ‌ల‌స అంద‌రికీ ఈ పోర్ట‌ల్ సుల‌భ‌త‌రంగా ఉంటుంద‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com