రైలు బోగీ మారే ప్రయత్నం ఓ మహిళ ప్రాణాలను బలిగొంది. ట్రైన్ ఎక్కే క్రమంలో ప్లాట్ఫామ్ మధ్య పడిపోయి ప్రాణాలు కోల్పోయింది. కళ్లెదుటే తల్లి మరణించడంతో పిల్లలు బోరున విలపించారు. ఈ విషాధ ఘటన చర్లపల్లి రైల్వేస్టేషన్లో జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా దొండపూడి గ్రామానికి చెందిన మట్టల వెంకటేశ్, శ్వేత దంపతులు. వీరికి ఇద్దరు సంతానం. భర్త ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. భార్య శ్వేత (33) గృహిణి. లింగంపల్లి హెచ్ఎంటీ టౌన్షిప్ చింతల్ చంద్రానగర్లో వీరు నివాసం ఉంటున్నారు. వేసవి సెలవుల్లో పిల్లలతో అత్తింటికి వెళ్లి రావాలని శ్వేత భావించింది. ఇదే విషయాన్ని ఆమె తన భర్తకు చెప్పింది. దీంతో వెంకటేశ్ భార్య, పిల్లలను ఆదివారం రోజున లింగంపల్లి స్టేషన్లో జన్మభూమి ఎక్స్ప్రెస్లో ఎక్కించారు.
కళ్లెదుటే తల్లి మృతి
వీరంతా డి-8 బోగీలో ఎక్కాల్సి ఉండగా, పొరపాటుగా డి-3లో ఎక్కారు. రైలు లింగంపల్లి స్టేషన్కు చేరాక, వేరే ప్రయాణికులు వచ్చి అవి తమ సీట్లు అని చెప్పడంతో ఆమె విషయాన్ని గ్రహించారు. బోగీ బాగా రద్దీగా ఉండటంతో ఆమె చర్లపల్లి స్టేషన్లో తన ఇద్దరు పిల్లలతో రైలు దిగారు. డి-8 బోగీ వద్దకు చేరుకున్నారు. పిల్లలను బోగీలోకి ఎక్కించిన శ్వేత, రైలు ఎక్కే సమయంలో అది కదలడంతో ప్రమాదవశాత్తు రైలు, ప్లాట్ఫామ్ మధ్యలో పడిపోవడంతో మృతి చెందారు. కళ్లెదుటే తల్లి చనిపోవడంతో పిల్లలు బోరున విలపిస్తూ తల్లడిల్లిపోయారు. దీంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న వెంకటేశ్, భార్య మృతదేహాన్ని చూసి కుప్పకూలిపోయారు.