Monday, April 21, 2025

రెవెన్యూ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలి

డిజిపి జితేందర్‌ను కలిసి విజ్ఞప్తి చేసిన ట్రెసా నాయకులు
ముందస్తు అనుమతి లేకుండా రెవెన్యూ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని డిజిపి జితేందర్‌ను కలిసి ట్రెసా నాయకులు విజ్ఞప్తి చేశారు. —బాచుపల్లి తహసీల్దార్ పేరును కేసు నుంచి తొలగించాలని వారు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం డిజిపి జితేందర్‌ను ఆయన కార్యాలయంలో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్ కుమార్ లతో కూడిన ప్రతినిధి బృందం కలిసి రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో విధి నిర్వహణలో భాగంగా రెవెన్యూ అధికారులు తీసుకుంటున్న నిర్ణయాల్లో ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఎలాంటి ముందుస్తు అనుమతి లేకుండా, విచారణ లేకుండా మేజిస్ట్రేట్ హోదాలో ఉన్న తహసీల్దార్లపై, ఆర్డీఓలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారని ట్రెసా ప్రతినిధులు డిజిపి దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి సంఘటనలు వనపర్తి, నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్ -మల్కాజిగిరి, కరీంనగర్ వంటి జిల్లాలో చోటుచేసుకున్నాయని డిజిపితో వారు పేర్కొన్నారు.

కొన్ని చోట్ల క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్
కొన్ని చోట్ల క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 197 (సిఆర్‌పిసి) కింద అలాగే కొత్త చట్టం భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023 సెక్షన్ 218(బిఎన్‌ఎస్‌ఎస్) క్రింద ఏదైనా మేజిస్ట్రేట్ హోదాలో ఉన్న అధికారిపైన విధి నిర్వహణలో భాగంగా తీసుకునే చర్యలపై కేసు నమోదు చేసి విచారణ చేయడానికి జిల్లా కలెక్టర్ లేదా ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని చట్టం చెబుతుందని, దీనిపై అన్ని జిల్లాల ఎస్పీలకు, పోలీస్ కమిషనర్లకు రాతపూర్వమైన ఆదేశాలు ఇవ్వాలని వారు డిజిపికి విజ్ఞప్తి చేశారు. గతంలో ఈ విషయంలో అనేక మార్లు వినతిపత్రాలు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ట్రెసా ప్రతినిధులు గుర్తు చేశారు.

అలాగే ఇటీవల బాచుపల్లి తహసీల్దార్ పూల్ సింగ్ సర్వేకు సంబంధించిన విషయంలో లొకేషన్ స్కెచ్‌పై అటెస్టెడ్ చేశారని క్రిమినల్ కేసు నమోదు చేశారని, ఆ కేసు నుంచి ఆయన పేరును తొలగించాలని, దీనిపై జిల్లా కలెక్టర్‌తో విచారణ చేయించి న్యాయం చేయాలని వారు డిజిపిని కోరారు. ట్రెసా వినతిపై సానుకూలంగా స్పందించిన డిజిపి ట్రెసా విజ్ఞప్తిని పరిశీలించి అన్ని జిల్లాల ఎస్పీలకు, పోలీస్ కమిషనర్లకు తగిన ఆదేశాలిస్తామని డిజిపి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్‌లతో పాటు కో ఆర్డినేటర్ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com